తలసానిపై టీ-సీఎస్‌కు గవర్నర్‌ లేఖ

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై గవర్నర్‌ కార్యాలయం తొలిసారిగా స్పందించింది. ఇప్పటి వరకు తలసాని శ్రీనివాసయాదవ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయాలని, ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగనివ్వడం గవర్నర్‌ చేతకానితనమని… ఇలా రకరకాలుగా కాంగ్రెస్‌ నుంచి, తెలుగుదేశం నుంచి కూడా ఫిర్యాదులందుకున్న గవర్నర్‌ ఇప్పటికి దీనిపై స్పందించారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి […]

Advertisement
Update: 2015-09-26 00:49 GMT
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై గవర్నర్‌ కార్యాలయం తొలిసారిగా స్పందించింది. ఇప్పటి వరకు తలసాని శ్రీనివాసయాదవ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయాలని, ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగనివ్వడం గవర్నర్‌ చేతకానితనమని… ఇలా రకరకాలుగా కాంగ్రెస్‌ నుంచి, తెలుగుదేశం నుంచి కూడా ఫిర్యాదులందుకున్న గవర్నర్‌ ఇప్పటికి దీనిపై స్పందించారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అయితే నేరుగా గవర్నర్‌ మీదే పత్రికలకు ఎక్కారు. ఫిర్యాదులు చేశారు. టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించి మంత్రి పదవిలో తలసాని కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘం, గవర్నరుకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన తలసాని పార్టీ ఫిరాయించడం, ఆపై కేబినెట్‌లోకి తీసుకోవడం, ఛాంబర్‌ కేటాయించడం తదితర అంశాలకు సంబంధించిన జీవో కాపీలు తలసాని రాజీనామా లేఖను ఫిర్యాదుకు జత చేసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేంద్రం నుంచి కూడా గవర్నర్‌ను వివరణ కోరినట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ టికెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకోవడం… ఏకంగా ప్రభుత్వంలో మంత్రి పదవినే చేజిక్కించుకోవడం వివాదానికి దారితీసింది. ఇప్పటికి కూడా ఆయన టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. దీనిపై తొలిసారిగా స్పందించిన గవర్నర్‌ కార్యాలయం తలసాని మంత్రి పదవిలో కొనసాగడంపై తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    
Advertisement

Similar News