Telugu Global
WOMEN

కేరళ స్త్రీలు... ఇజ్రాయిల్ పోలీసు దుస్తుల తయారీ

ఇజ్రాయిల్ పోలీసులకు కేరళకు ఒక అనుబంధం ఉంది. కేరళకు సంబంధించిన ఓ కంపెనీ ఇజ్రాయిల్ పోలీసులకు యూనిఫామ్స్ ని తయారుచేస్తోంది.

కేరళ స్త్రీలు... ఇజ్రాయిల్ పోలీసు దుస్తుల తయారీ
X

కేరళ స్త్రీలు... ఇజ్రాయిల్ పోలీసు దుస్తుల తయారీ

ఇజ్రాయిల్ పోలీసులకు కేరళకు ఒక అనుబంధం ఉంది. కేరళకు సంబంధించిన ఓ కంపెనీ ఇజ్రాయిల్ పోలీసులకు యూనిఫామ్స్ ని తయారుచేస్తోంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో రాష్ట్ర రాజధాని తిరువనంతపురంకి 463కిలోమీటర్ల దూరంలో ఈ కంపెనీ ఉంది. మార్యన్ అప్పారెల్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఇజ్రాయిల్ పోలీసులకోసం సంవత్సరానికి లక్ష యూనిట్ల యూనిఫామ్స్ ని తయారుచేస్తోంది.

ఈ కంపెనీలో 1500 మంది పనిచేస్తుండగా అందులో 95శాతం మందికి పైగా మహిళలే ఉన్నారు. ఈ కంపెనీ ఆర్మీ, పోలీస్, సెక్యురిటీ, ఆరోగ్య రంగాల్లో పనిచేస్తున్న భిన్నదేశాలకు సంబంధించిన సిబ్బందికి యూనిఫామ్స్ ని తయారు చేయటంలో నైపుణ్యతని సాధించింది. బీడీ కార్మికులుగా పనిచేసేవారు ఉపాధి కోల్పోయిన సమయంలో వారికి పనికల్పించే ఉద్దేశ్యంతో ఈ కంపెనీని ప్రారంభించారు.


ఎనిమిదేళ్లుగా కేరళ దుస్తుల తయారీ కంపెనీ సిబ్బంది ఇజ్రాయిల్ పోలీసులకు యూనిఫామ్స్ అందిస్తున్నారు. అప్పటినుండి నిరంతరాయంగా ఈ కంపెనీనుండి ఇజ్రాయిల్ పోలీసులకు యూనిఫామ్స్ వెళుతున్నాయి. ఇంతకుముందు ఈ కంపెనీ ఫిలిప్పియన్ ఆర్మీకి కువైట్ ప్రభుత్వ అధికారులకు సైతం యూనిఫాంలను అందించింది. ఆ తరువాత ఇజ్రాయిల్ నుండి పోలీసు అధికారులు వచ్చి ఫ్యాక్టరీ పనితీరుని పరిశీలించి యూనిఫామ్స్ తయారీ ఆర్డరుని ఇచ్చారు.

ఎనిమిదేళ్లుగా ఇజ్రాయిల్ పోలీసులకు యూనిఫామ్స్ ని అందిస్తున్న కేరళ సంస్థ అక్కడ ప్రస్తుతమున్న అనిశ్చిత పరిస్థితులు చక్కబడి శాంతి పునరుద్ధరణ జరిగేవరకు యూనిఫాం దుస్తులను పంపకూడదనే నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చోటుచేసుకుంటున్న అమానవీయ సంఘటనలు, హాస్పటల్ పైన బాంబులు వేయటం, వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవటం లాంటివి చూశాక దుస్తుల తయారీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వారితో ఉన్న ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని, ఇరువైపులా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని కంపెనీ ఎండీ థామస్ ఒలిక్కల్ తెలిపారు.

‘ హమాస్ ఇజ్రాయిల్ పై చేస్తున్న దాడులు, పౌరులను చంపటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇజ్రాయిల్ ప్రతీకారాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇరవై అయిదు లక్షలమందికి పైగా ప్రజలకు ఆహారం, నీరు అందకుండా చేయటం, ఆసుపత్రులపై బాంబులు వేయటం, మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను చంపటం వంటివి చాలా దారుణాలు. యుద్దం ముగిసి శాంతి నెలకొనాలని మేము కోరుకుంటున్నాం’ అనే సందేశాన్ని ఒలిక్కల్ ఓ వీడియో మెసేజ్ ద్వారా వెల్లడించారు.

First Published:  22 Oct 2023 8:06 AM GMT
Next Story