Telugu Global
WOMEN

‘నా కుటుంబ శ్రేయస్సు కోసం చనిపోతున్నా...’ ఎన్నారై మహిళ

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కర్ణాటకలోని బెళగావికి వచ్చి అక్కడ ఆత్మహత్మకు పాల్పడింది.

‘నా కుటుంబ శ్రేయస్సు కోసం చనిపోతున్నా...’ ఎన్నారై మహిళ
X

 ‘నా కుటుంబ శ్రేయస్సు కోసం చనిపోతున్నా...’ ఎన్నారై మహిళ

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కర్ణాటకలోని బెళగావికి వచ్చి అక్కడ ఆత్మహత్మకు పాల్పడింది. తన పిల్లల కస్టడీ ఆస్ట్రేలియా అధికారులకు వెళ్లిపోవటంతో ఆమె ఆ ఆవేదనని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్ట్రేలియా నుండి బెంగళూరు వచ్చి అక్కడి నుండి బస్ లో బెళగావికి చేరుకుంది. ప్రియదర్శిని వయసు 40 సంవత్సరాలు. తన మరణానికి ఆస్ట్రేలియా అధికారులు, ఇంకా కొంతమంది సిడ్నీ ప్రాంత వాసులు కారణమని, వారు తనని తన కుటుంబాన్ని వేధించారని ఆమె తన సూసైడ్ నోట్ లో తెలిపింది.

ప్రియదర్శిని కుటుంబానికి ఆస్ట్రేలియాకు చెందిన అధికారులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆమె కొడుకు అమర్త్య ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడిని హాస్పటల్ లో చేర్చినప్పుడు అక్కడి అధికారులు... ఆమె పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనే వాదనను లేవనెత్తటంతో ప్రియదర్శినికి ఆస్ట్రేలియా అధికారులకు మధ్య వివాదం మొదలైంది. దాంతో ఆమె పిల్లలిద్దరినీ అక్కడి అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆ వివాదాలు కొలిక్కి రాకపోవటంతో ప్రియదర్శిని తన సిటిజన్ షిప్ ని వదిలేసుకుని ఇండియా వెళ్లిపోయి తన పిల్లలకు చికిత్స చేయించుకుంటానని కోరింది. అయితే ఆస్ట్రేలియా అధికారులు ఆమె కోరికని అంగీకరించలేదు. దాంతో భారత్ కి తిరిగి వచ్చిన ఆమె ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరు, తన ఆరోగ్య సమస్యలు రెండింటినీ తట్టుకోలేక ప్రియదర్శిని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

‘మా చుట్టుపక్కలవాళ్లు మమ్మల్ని వేధించారు. మా జీవితాలకు భద్రత లేదు. నా భర్త, పిల్లలు జీవించి ఉండాలంటే నేను నా జీవితాన్ని ముగించాలి. నా కుటుంబ శ్రేయస్సు కోసం నేను నా చావుని అంగీకరిస్తున్నాను. 2021నుండి ఈ రోజు వరకు ఆస్ట్రేలియా డిపార్ట్ మెంట్ ఆఫ్ కమ్యునిటీస్ అండ్ జస్టిస్ నా కుటుంబాన్ని నాశనం చేసింది. సిడ్నీలోని వర్లీ వీధిలో ఉండేవారు మమ్మల్ని చాలా హింసించారు.’ అంటూ ప్రియదర్శిని సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి కుటుంబం తమని చాలా బాధపెట్టిందని, తమ ఇంటికి వచ్చే నీరు విషపూరితంగా ఉండేవని ఆమె రాశారు. ఇక్కడి పోలీసులు ప్రియదర్శిని ఆత్మహత్య కేసుని విచారణ చేస్తున్నారు.

First Published:  27 Aug 2023 12:55 PM GMT
Next Story