Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ స్పిరిచ్యువల్ తెలంగాణ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

మాన్‌సూన్ సీజ‌న్‌లో తెలంగాణలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను చుట్టివచ్చేలా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్.. ‘స్పిరిచ్యువల్ తెలంగాణ’ పేరుతో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఐఆర్‌‌సీటీసీ స్పిరిచ్యువల్ తెలంగాణ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ స్పిరిచ్యువల్ తెలంగాణ టూర్.. హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ఈ టూర్ 3 రాత్రులు, 4 రోజుల పాటు సాగుతుంది. ఈ టూర్ ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 28వ తేదికి గానూ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీశైలం, యాదాద్రి క్షేత్రాలు కూడా కవర్ అవుతాయి.


ప్రయాణం ఇలా..

ఈ టూర్ ప్యాకేజీలో యాదాద్రి, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్కు, బిర్లా మందిర్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలను చూడొచ్చు. మొదటి రోజు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్ల దగ్గర ఐఆర్‌సీటీసీ వాహనం యాత్రికులను పిక్ చేసుకుంటుంది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ చూసి.. రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. రెండో రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసి శ్రీశైలం బయలుదేరతారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రోజురాత్రి హోటల్‌లో స్టే చేస్తారు. మూడో రోజు బిర్లామందిర్, గోల్కొండ కోట, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూస్తారు. రాత్రికి హైదరాబాద్‌లో హోటల్‌లో బస చేయాలి. ఇక నాలుగోరోజు ఉదయం యాదాద్రి బయల్దేరతారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాక సురేంద్రపురి విజిట్ ఉంటుంది. ఆ తర్వాత యాత్రికుల్ని హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో భాగంగా ఏసీ వాహనం, ఏసీ హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ప్యాకేజీ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.37,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 14,880 గా ఉన్నాయి.

*

First Published:  23 Aug 2023 10:38 AM GMT
Next Story