Telugu Global
Telangana

వివేకా హత్యకేసు విచారణ మార్చి 10కి వాయిదా..

మొత్తం ఐదుగురు నిందితుల్లో శివశంకర్‌ రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండగా.. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు చంచల్ గూడ జైలుకి తరలించారు.

వివేకా హత్యకేసు విచారణ మార్చి 10కి వాయిదా..
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. కడప జైలులో ఉండే ముగ్గురు నిందితుల్ని కూడా హైదరాబాద్ చంచల్ గూడ జైలులోనే ఉంచాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. మార్చి 10న నిందితులు మరోసారి కోర్టుకి రావాలని పేర్కొంది. కేసు విచారణ మార్చి 10కి వాయిదా వేసింది. మొత్తం ఐదుగురు నిందితుల్లో శివశంకర్‌ రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉండగా.. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌ పై బయట ఉన్నారు. కోర్టు ఆదేశాలతో కడప జైలు నుంచి విచారణకోసం తెచ్చిన ముగ్గుర్ని కూడా ఇప్పుడు చంచల్ గూడ జైలుకి తరలించారు.

వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ నేపథ్యంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఫైళ్లను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి గతంలోనే తీసుకొచ్చారు. ఈరోజు సునీల్‌ యాదవ్‌, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డిన కడప జైలునుంచి హైదరాబాద్ కోర్టుకి తరలించారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని కూడా కోర్టుకి హాజరు పరిచారు.

ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌ లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం ఈరోజు విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకోసం సీబీఐ అధికారులు నిందితులను కడప నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు చంచల్ గూడ జైలుకి తరలించారు.

First Published:  10 Feb 2023 8:17 AM GMT
Next Story