Telugu Global
Telangana

ఇంట్లో దూరి అత్యాచారానికి యత్నం.. దుండగుడిని కొట్టి చంపిన మహిళ

ఈ ఘటన తర్వాత మహిళ తన భర్తతో కలిసి రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంట్లో దూరి అత్యాచారానికి యత్నం.. దుండగుడిని కొట్టి చంపిన మహిళ
X

ఓ వ్యక్తి మ‌ద్యం మ‌త్తులో రోడ్డు పైకి వచ్చాడు. ఓ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన మ‌హిళ‌పై అత్యాచారం చేయబోయాడు. అతడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చినా అతడు ఆమెను వదల్లేదు. దీంతో తిరగబడ్డ ఆ మహిళ దుండగుడిపై దాడి చేసి చంపింది. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

బద్వేల్‌లో శుక్రవారం తెల్లవారుజామున శ్రీనివాస్ అనే వ్యక్తి త‌ప్ప తాగి రోడ్డుపైకి వచ్చాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో ఓ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. త‌లుపు తీసిన మ‌హిళ ఎవరు కావాలి అని అడిగినప్పటికీ శ్రీనివాస్ సమాధానం ఇవ్వలేదు. అతడు తాగిన మత్తులో ఉన్నట్లు గుర్తించిన మహిళ వెంటనే డోర్ వేసుకునే ప్రయత్నం చేసింది.

అంతలోనే మహిళను లోపలికి నెడుతూ శ్రీనివాస్ కూడా ఇంట్లోకి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. శ్రీనివాస్ నుంచి ఎలాగోలా తప్పించుకొని మహిళ బయటకు వచ్చింది. అక్కడ కూడా అతడు ఆమె వెంటపడగా పక్కనే ఉన్న రాడ్ తీసుకొని శ్రీనివాస్‌పై దాడి చేసింది. దీంతో శ్రీనివాస్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన తర్వాత మహిళ తన భర్తతో కలిసి రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  24 Jun 2023 6:46 AM GMT
Next Story