Telugu Global
Telangana

భర్త వివాహేతర సంబంధం.. పాముతో కాటేయించి చంపిన భార్య

ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందినట్లు లలిత అందరినీ నమ్మించింది. అయితే ప్రవీణ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మరణంపై సందేహాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. పాముతో కాటేయించి చంపిన భార్య
X

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భార్య పాముతో కాటేయించి చంపించింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పట్టణానికి చెందిన ప్రవీణ్(42) రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఇతడికి భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా వ్యాపారం నిమిత్తం ప్రవీణ్ వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు మరో మహిళ పరిచయం కాగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ప్రవీణ్ మరో మహిళకు దగ్గరైనట్లు ఇటీవల లలిత గుర్తించింది. ఆమెకు దూరం కావాలని పలుమార్లు చెప్పి చూసింది. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో భర్తను చంపేయాలని లలిత నిర్ణయించుకుంది. ప్రవీణ్ దగ్గర సెంట్రింగ్ పనులకు వచ్చే సురేష్‌తో ఈ విషయమై మాట్లాడింది. తన భర్తను చంపితే ఒక ఫ్లాట్ రాసిస్తానని చెప్పింది.

సురేష్ మరో ఐదుగురు వ్యక్తులతో ప్రవీణ్ హత్యకు పథకం రచించాడు. ఈనెల 9న ప్రవీణ్ మద్యం మత్తులో నిద్రపోతుండగా సురేష్‌కు లలిత సమాచారం ఇచ్చింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సురేష్ ఓ పామును తీసుకొని అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న ప్రవీణ్‌ను సురేష్ అతడి వెంట వచ్చిన ఐదుగురు వ్యక్తులు దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత పాముతో కాటేయించారు. ప్రవీణ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు.

ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందినట్లు లలిత అందరినీ నమ్మించింది. అయితే ప్రవీణ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మరణంపై సందేహాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. లలితను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో లలితే మరో ఆరుగురి సహాయంతో భర్తను హతమార్చిందని డీఎస్పీ వైభవ్ గైక్వాడ్ తాజాగా ప్రకటించారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హత్య చేయాల్సి వచ్చిందని లలిత అంగీకరించినట్లు వెల్లడించారు.

First Published:  14 Oct 2023 9:32 AM GMT
Next Story