Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ పథకాలను మనమెందుకు అమలు చేయకూడదు .. కంటివెలుగు, నీటిపారుదలపై సీఎం కేజ్రివాల్ ప్రశంసలు

సాగునీటి పారుదల రంగంలో ఎంతో అద్భుతమైన పనితీరు చూపించారు. రాష్ట్రంలోని ప్రతీ పంట పొలానికి నీరు అందిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు.

సీఎం కేసీఆర్ పథకాలను మనమెందుకు అమలు చేయకూడదు .. కంటివెలుగు, నీటిపారుదలపై సీఎం కేజ్రివాల్ ప్రశంసలు
X

తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు టైంలో కాళేశ్వరంతో పాటు అనేక నీటి పారుదల రంగ ప్రాజెక్టులు పూర్తి చేశారు. దీంతో ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న చోటే.. ఇప్పుడు పండుగలా మారింది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. మరోవైపు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యధిక శ్రద్ద తీసుకుంటోంది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మిస్తోంది. కంటి వెలుగు ద్వారా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని సీఎం కేసీఆర్ ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు. ఇప్పుడీ విషయం నిజమేనని రుజువయ్యింది.

సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎన్నో ప్రజాప్రయోజనమైన కార్యక్రమాలు చేపట్టారు. సాగునీటి పారుదల రంగంలో ఎంతో అద్భుతమైన పనితీరు చూపించారు. రాష్ట్రంలోని ప్రతీ పంట పొలానికి నీరు అందిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. జీ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అఛీవర్స్ అవార్డ్స్ - 2023లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ ప్రసంగిస్తూ.. తెలంగాణలో కేసీఆర్ సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేజ్రివాల్ వివరించారు.

కొన్ని రోజుల కిందట తెలంగాణ వెళ్లాను. అక్కడ కంటి వెలుగు అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే అద్బుతమైన కార్యక్రమమని కేజ్రివాల్ చెప్పారు. కంటి వెలుగు ద్వారా ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడమే కాకుండా.. అవసరమైన వారికి ఉచితంగా సర్జరీలు చేయించారు. మందులను కూడా ఉచితంగానే అందించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కార్యక్రమాన్ని..చాలా తక్కువ ఖర్చుతోనే చేపట్టారని వివరించారు.

మనం ఒకరి నుంచి మరొకరం ఎందుకు నేర్చుకోలేకపోతున్నామని ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాను. దేశంలో ఎంతో మంది ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. ఒకరి దగ్గర ఉన్న మంచిని మనం ఎందుకు స్వీకరించలేక పోతున్నామని కేజ్రివాల్ ప్రశ్నించారు. మనం ఎప్పుడూ ఒకరిని ఎలా పడేయాలా అని ఆలోచనలు చేస్తున్నాము. నిత్యం గొడవలు, విద్వేషాలతో సమయాన్ని వృధా చేస్తున్నామని కేజ్రివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రభుత్వమే ఎంతో మంచి కార్యక్రమాలను చేపట్టింది. అలాంటి ప్రభుత్వాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వమే అలాంటి పనులకు అడ్డుగా నిలుస్తోందని కేజ్రివాల్ ఆరోపించారు. మన వ్యవస్థ ఎలా తయారైంది అంటే.. మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని స్పూర్తిగా తీసుకొవాల్సింది పోయి.. వారికే ఆటంకాలు సృష్టిస్తోందని కేజ్రివాల్ పేర్కొన్నారు.

కేవలం ప్రభుత్వాలనే కాకుండా.. వ్యాపారాలు చేసే వారిని, స్టార్టప్‌లు మొదలు పెట్టాలనుకునే విద్యార్థులను కూడా ఈ వ్యవస్థ ఆపాలనే ప్రయత్నిస్తోంది. ఇలాంటి పద్దతిని ఆపేయాలి. మన వ్యవస్థలో ఉన్న ప్రతికూలతను నిలిపివేయాలని కేజ్రివాల్ సూచించారు. మన వ్యవస్థలో ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. మన దేశంలో ప్రతిభకు ఎలాంటి కొదువ లేదు. మన ప్రజలు చాలా తెలివైన వాళ్లు. మన వ్యవస్థను సక్రమంగా మార్చి వేస్తే.. ప్రపంచంలోనే మన దేశం నంబర్ 1 దేశంగా మారుతుందని సీఎం కేజ్రివాల్ అన్నారు.


First Published:  29 July 2023 4:50 AM GMT
Next Story