Telugu Global
Telangana

కిషన్ రెడ్డి అంత త్యాగమూర్తా..? సీఎం సీటునే త్యాగం చేశారా..?

కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఆయన త్యాగం గురించి మరింత గొప్పగా చెప్పుకుంటున్నారు అభిమానులు.

కిషన్ రెడ్డి అంత త్యాగమూర్తా..? సీఎం సీటునే త్యాగం చేశారా..?
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పోటీ చేసినా గెలిచేది లేదని, కేంద్ర మంత్రిగా ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే అవమానకరంగా ఉంటుందని, అందుకే ఆయన బరిలో దిగలేదని వైరి వర్గాలు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నాయి. అయితే కిషన్ రెడ్డి వివరణ మాత్రం మరీ విచిత్రంగా ఉంది. తమ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందని, ఇప్పుడు తాను పోటీలో ఉంటే ప్రజలకు, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అందుకే తాను పోటీలో లేనని అన్నారాయన.

అంత త్యాగం చేశారా..?

పొరపాటున కిషన్ రెడ్డి పోటీ చేసి గెలిస్తే, బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తే.. సీనియార్టీ ప్రకారం ఆయనకే సీఎం కుర్చీ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఆయన త్యాగం గురించి మరింత గొప్పగా చెప్పుకుంటున్నారు అభిమానులు.

అసెంబ్లీకి పోటీ చేస్తే.. ఆ స్థానంపై కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసేందుకు కిషన్ రెడ్డి అసెంబ్లీ బరిలో లేరని ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలన్నారు. అసలు కిషన్ రెడ్డి ఎన్ని సభలకు హాజరయ్యారు, ఎన్ని రోడ్ షో లలో పాల్గొన్నారు అనే లెక్క తీస్తే.. ఆయన ఏపాటి ప్రచారం చేశారో తెలిసిపోతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంటే.. బీజేపీ మాత్రం వెనకపడింది. కేవలం కేంద్ర నాయకత్వం వస్తేనే హడావిడి చేస్తున్నారు. రాష్ట్ర నాయకులెవరూ ఆ స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు వెళ్లలేకపోతున్నారు. కిషన్ రెడ్డి కూడా ఎక్కడా హడావిడి చేయడంలేదు. ఒక రకంగా ఎన్నికలకు ముందే రాష్ట్ర బీజేపీ అస్త్ర సన్యాసం చేసిందనే చెప్పాలి.

First Published:  24 Nov 2023 5:58 AM GMT
Next Story