Telugu Global
Telangana

మును 'గోడు'.. బండి 'ఘోష'

హుజూర్ నగర్, నాగార్జున సాగర్ కి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండలో జరుగుతున్న మూడో ఉప ఎన్నిక మునుగోడు. ఇక్కడ కూడా బీజేపీకి పరాభవం ఖాయమైంది.

మును గోడు.. బండి ఘోష
X

వేర్ ఈజ్ బండి సంజయ్.. మునుగోడులో బీజేపీ కార్యకర్తలు వెదుక్కుంటున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టినట్టే, బీజేపీ ప్రచారానికి బండి సంజయ్ మొహం చాటేశారు. ఉద్దేశపూర్వకంగానే, వ్యూహాత్మకంగానే బండి మునుగోడుకి దూరం జరిగారని తెలుస్తోంది. మొదట్లో పాదయాత్ర పేరుతో ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు పాదయాత్ర పూర్తయినా కనపడ్డంలేదు. ఎన్నికల్లో జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తారనుకున్నా రోజులు దగ్గరపడేకొద్దీ ఆ ఊసే లేదు. రాష్ట్రంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారానికి రావట్లేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి కూడా ప్రచారానికి రాకపోయే సరికి బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.

ఆమధ్య బండి సంజయ్ కి ఢిల్లీనుంచి పిలుపొచ్చిందని, అక్కడ రహస్య మంతనాలు సాగిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ చివరకు బండి వ్యూహాలేంటో బయటపడలేదు, కేంద్రం ఆయనకు ఏమని దిశానిర్దేశం చేసిందో కూడా బయటకు రాలేదు. ఎన్నికల టైమ్ లో మరింత వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ నేతల్ని విమర్శలతో ఇరుకున పెడతారనుకున్న బండి ఇంత సైలెంట్ గా ఉంటారని ఎవ్వరూ ఊహించలేదు.

ట్వీట్లు కూడా లేవే..

జనాల్లో యాక్టివ్ గా లేకపోతే లేక‌పోయారు, కనీసం ట్విట్టర్లో కూడా బండి యాక్టివ్ గా లేరు. మునుగోడు గురించి, ఉప ఎన్నిక గురించి ఆయన ట్వీట్ వేసి వారం దాటిపోయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో బండి వ్యవహారంపై మరిన్ని అనుమానాలు ముసురుకొంటున్నాయి.

గతంలో కూడా ఇంతే..

గెలుస్తారనుకున్న స్థానాల్లో బండి హడావిడి మామూలుగా ఉండదు. పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తెలిసినా ఓటమిని తట్టుకోవడం ఆయనకు సాధ్యం కాదు. అందుకే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో కూడా బండి మధ్యలోనే అంతర్థానమయ్యారు. వాస్తవానికి పాత నల్లగొండ జిల్లాలో బీజేపీకి ఉనికి లేదు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ కి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండలో జరుగుతున్న మూడో ఉప ఎన్నిక మునుగోడు. ఇక్కడ కూడా బీజేపీకి పరాభవం ఖాయమైంది. మరీ దారుణంగా మూడో స్థానం, దానికి తోడు డిపాజిట్ల దక్కవన్న సమాచారంతో బండి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఓటమి భారాన్ని కేవలం రాజగోపాల్ రెడ్డిపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఓటమి రిపోర్ట్ లు రాగానే బండి ప్రచారానికి వెళ్లడం మానేశారు.

First Published:  16 Oct 2022 11:16 AM GMT
Next Story