Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఉద్రిక్తతలపై ఇవాళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?

సభలో కేసీఆర్ కచ్చితంగా హైదరాబాద్‌లోని పరిస్థితులను వెల్లడిస్తూనే.. అందుకు కారణమైన బీజేపీపై తప్పకుండా విరుచుకపడతారని భావిస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

హైదరాబాద్‌లో ఉద్రిక్తతలపై ఇవాళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
X

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇవాళ ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉన్నది. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ ఇమేజీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇతర మెట్రో నగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ వల్ల హైదరాబాద్‌లో మత సామరస్యం దెబ్బతినడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. నగరంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్, మూడు కమిషనరేట్ల సీపీలు పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం సీఎంవో బయటకు వెల్లడించలేదు.

సీఎం కేసీఆర్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కొంగరకలాన్‌లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో కేసీఆర్ కచ్చితంగా హైదరాబాద్‌లోని పరిస్థితులను వెల్లడిస్తూనే.. అందుకు కారణమైన బీజేపీపై తప్పకుండా విరుచుకపడతారని భావిస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వాటికి ఆజ్యం పోసేలా బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా మాట్లాడారు. వీరిద్దరి కారణంగానే మత ఘర్షణలు ప్రారంభమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడి జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ ఇంత వరకు బహిరంగంగా స్పందించలేదు.

ఇవాళ కొంగరకలాన్‌లో జరిగే సభలో హైదరాబాద్ ఘర్షణలపై తప్పకుండా స్పందిస్తారని తెలుస్తున్నది. ఇలాంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే ఉండదని.. దీనికి కారకులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని ఇప్పటికే కేసీఆర్ సమీక్షలో చెప్పినట్లు సమాచారం. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంటారు. కానీ బుధవారం హోం మంత్రి మహమూద్ అలీ కేవలం ప్రెస్ నోట్ విడుదల చేశారు. గురువారం సీఎం నేరుగా సభలోనే ఈ విషయాలను ప్రస్తావించాలని భావిస్తున్నారని, అందుకే బుధవారం ఎలాంటి మీడియా మీట్ నిర్వహించలేదని తెలుస్తున్నది. మత ఘర్షణల వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం ఉన్నాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ స్పందిస్తారని.. తప్పకుండా బీజేపీని ఎండగడతారని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

First Published:  25 Aug 2022 3:08 AM GMT
Next Story