Telugu Global
Telangana

'బండి సంజయ్, కిషన్ రెడ్డితో పని లేదు.. నేరుగా కేంద్రంతోనే డీల్'

పైలెట్ తరపున మాట్లాడిన నందకుమార్ కూడా పూర్తి విషయాలు వెల్లడించారు. పైలెట్ చాలా తెలివైన వ్యక్తని, అతడిలో సామర్థ్యం ఉందని నందకుమార్ చెప్పుకొచ్చారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డితో పని లేదు.. నేరుగా కేంద్రంతోనే డీల్
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో రెండో ఆడియో క్లిప్ బయటపడింది. ఇందులో సింహయాజులు, నందకుమార్ మధ్య దాదాపు అరగంట సంభాషణ జరిగింది. పైలెట్ రోహిత్ రెడ్డి రావడానికి ఎంత అడుగుతున్నాడు.. ఆయన వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారనే విషయాలు చర్చించారు. పైలెట్ తరపున మాట్లాడిన నందకుమార్ కూడా పూర్తి విషయాలు వెల్లడించారు. పైలెట్ చాలా తెలివైన వ్యక్తని, అతడిలో సామర్థ్యం ఉందని నందకుమార్ చెప్పుకొచ్చారు. ఆడియోలో మాట్లాడిన కొన్ని ముఖ్యమైన విషయాలు..

నందకుమార్ : పైలెట్‌తో నేను అన్ని విషయాలు మాట్లాడాను. కొంత నసిగాడు. కానీ ఆయనతో రాత్రి ఫేస్‌టైమ్ మాట్లాడతాను. నువ్వు ముందు వస్తావు కాబట్టి నువ్వే టీమ్ లీడర్‌వి. అంతా నీతోనే అవుతుందని చెప్పి ఇన్‌స్పైర్ చేశాను. దీంతో ఆయన రెడీ అయ్యారు.

సింహయాజులు : ఓకే

నందకుమార్ : అయితే, అన్నా ఇది సీరియస్ ఇష్యూ చాలా రిస్క్ ఉంది. నేను చాలా చేశాను కదా అన్నాడు. నాకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వండి. నాకు ఒక రేటు. మిగిలిన వారితో నేను మాట్లాడతాను అన్నాడు.

సింహయాజులు : ఓకే. అతనికి (రోహిత్) ఎంత కావాలని అడిగాడు?

నందకుమార్ : అతను 100 రూపీస్ (వంద కోట్లు) ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు.

సింహయాజులు : ఓకే. అతనితో ఇంకా ఎంత మంది వస్తున్నారు.

నందకుమార్ : అతనితో కలిపి నలుగురు వస్తారు

సింహయాజులు : ఓకే. వాళ్లకు సపరేట్‌గా డబ్బులు ఇవ్వాలా?

నందకుమార్ : హా, ఇవ్వాలి. కానీ అంత అవసరం లేదు.

సింహయాజులు : ఏంటీ..

నందకుమార్ : ఈ విషయాలన్నీ మనం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఉంటారు, వాళ్లు ఉంటారు.

సింహయాజులు : ముందు నాకు ఒక విషయం క్లారిటీ రావాలి. నేను సంతోశ్‌కి వీళ్లు వస్తున్నారు, వీళ్లు ఇంత కోరుకుంటున్నారు.. అవన్నీ నేను చెప్పాలి.

నందకుమార్ : అదే స్వామీ.. కలిసినప్పుడు మాట్లాడతాను అంటున్నాడు.

సింహయాజులు : అయితే నేను సంతోశ్‌కి చెప్తాను. రోహిత్ మెయిన్ పర్సన్.. ఆయనతో మరో ముగ్గురు వస్తారు అని చెస్తా. మీరేం చేస్తారని సంతోశ్‌ని అడుగుతా. (నన్ను మాట్లాడనివ్వు) ఇక రెండో విషయం.. నలుగురితో కలసి పైలెట్ రావాలనుకుంటున్నాడు. దానికి ప్రొసీజర్ ఏంటి. మనం ఏం చేయాలి? అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కొంత మంది వస్తున్నారు. ఆ విషయం ఏం చేద్దామని మాట్లాడతాను..

నందకుమార్ : దాసోజు శ్రవణ్ ఆల్రెడీ టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యాడు. స్వామిగౌడ్, భిక్షమయ్యగౌడ్‌తో కలిసి. మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కానీ.. మీరేం చేయలేదు స్వామీ.

ఈ సంభాషణ చాలా సేపు కొనసాగింది. పైలెట్ గురించి పొగుడుతూ కాసేపు మాట్లాడాడు. అయితే పైలెట్ వచ్చే అవకాశం లేదేమో అని అవతల వ్యక్తికి అనుమానం వచ్చింది. చూడు నందూ.. మేం వచ్చామంటే పెద్ద వ్యవహారం నడపడానికే వస్తాము. చిన్న చిన్న వాటి కోసం వచ్చి కూర్చోము. ఇందులో బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు సంబంధం ఉండదని స్వామీజీ చెప్పుకొచ్చారు.

మనం ఢిల్లీలో ఏం చేస్తున్నామో స్టేట్ లీడర్లకు తెలియకూడదని నందు కోరగా.. అలాంటిది ఏమీ ఉండదని స్వామీజీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న వారికి చెప్పి చేయాలంటే అది వేరే విధంగా ఉంటుంది. అందుకే స్టేట్ లీడర్లను బైపాస్ చేసి డైరెక్ట్ సెంటర్‌తోనే డీల్ చేస్తున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవును.. ఇది సక్సెస్ అయితే స్టేట్ లీడర్లకు కూడా ఝలక్ ఇచ్చినట్లు ఉంటుంది. తర్వాత డీల్స్ కూడా ఇలాగే చేద్దామని నందకుమార్ చెప్పుకొచ్చారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మునుగోడు ఉపఎన్నికకు ముందే రమ్మని చెప్పానని.. అప్పుడైతేనే ఈ డీల్ ఉంటుందని స్పష్టం చేశానని నందకుమార్ కాల్‌లో చెప్పాడు. అదే చెప్తున్నా.. మునుగోడుకు ముందు 100కు తయారైతే నేను పైన మాట్లాడతాను అని సింహయాజులు అన్నారు. ఇది పక్కా అయితేనే నేను మాట్లాడతానని చెప్పారు.

కాగా, నలుగురి పేర్లు కావాలని అడిగినా.. నందు మాత్రం అది కాన్ఫిడెన్షియల్ అని కలిసినప్పుడే ఇస్తామని చెప్పుకొచ్చాడు. అయితే పేర్లు ముందే ఇస్తే.. సంతోశ్ రాసుకుంటాడు.. ఆ డీల్ ఫిక్స్ చేస్తాడని స్వామీజీ చెప్పుకొచ్చాడు. పేర్లు తెలిస్తే సంతోశ్ డైరెక్ట్‌గా అమిత్ షాతో మాట్లాడి డీల్ ముగిస్తాడని అన్నారు.

ఈ కాల్ పూర్తిగా వింటే.. రోహిత్ రెడ్డితో పాటు పరిగి, కొడంగల్, చేవెళ్ల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండో ఆడియో క్లిప్‌లో కోడ్ లాంగ్వేజ్‌లో కాకుండా ఏకంగా అమిత్ షా పేరు తీయడం.. స్టేట్ లీడర్లకు తెలియకుండా సెంట్రల్ డీల్ చేస్తుందని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  28 Oct 2022 12:10 PM GMT
Next Story