Telugu Global
Telangana

టీడీపీ వల్లే అధికారంలోకి వచ్చాం.. చంద్రబాబుకు థ్యాంక్స్

టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు.

టీడీపీ వల్లే అధికారంలోకి వచ్చాం.. చంద్రబాబుకు థ్యాంక్స్
X

టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ గెలుపు కృషిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని ఆయన స్పష్టంచేశారు. అధికారంలో లేమని తెలుగు తమ్ముళ్లు డీలా పడొద్దని, భవిష్యత్‌లో అందరం కలిసే పని చేద్దామన్నారు. గురువారం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. టీడీపీ కృషి మరువలేనిదని, కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పనిచేశారన్నారు. 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోమన్నారు పొంగులేటి. టీడీపీ అధినేత చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడారు.

పొంగులేటి వ్యాఖ్యలపై రాజకీయం దుమారం రేగింది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా టీడీపీ ఏజెంట్లేనని తాము చేసిన ఆరోపణలు నిజమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పొంగులేటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు. లోపాయకారి ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుందని, కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని చెబుతున్నారు.

First Published:  2 Feb 2024 8:43 AM GMT
Next Story