Telugu Global
Telangana

పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో గుర్తింపేదీ..? ఠాక్రే ఎదుట విష్ణు ఆవేదన

కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్లకు దక్కుతున్న గుర్తింపు పాత వాళ్లకు దక్కడం లేదని విష్ణు ఠాక్రే వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పదవులు కూడా అన్ని కొత్త వాళ్లకే దక్కుతున్నాయని ఠాక్రే దృష్టికి తీసుకువెళ్లారు.

పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో గుర్తింపేదీ..? ఠాక్రే ఎదుట విష్ణు ఆవేదన
X

ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేత పీజేఆర్. తనకంటూ ప్రజల్లో సొంత ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడు ఆయన. ఆయన అకస్మాత్తుగా మరణించడంతో పీజేఆర్ రాజకీయ వారసుడిగా విష్ణు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే రికార్డ్ స్థాయి విజయం అందుకొని తండ్రి స్థాయికి చేరుకుంటాడని ఆశలు కల్పించారు. కారణాలు ఏవైనా విష్ణు మాత్రం పీజేఆర్‌లా ప్రజా నాయకుడిగా ఎదగలేకపోయారు.

ప్రస్తుతం తనకు కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదని విష్ణు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇవాళ విష్ణు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురవుతున్న సమస్యల గురించి వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్లకు దక్కుతున్న గుర్తింపు పాత వాళ్లకు దక్కడం లేదని విష్ణు ఠాక్రే వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పదవులు కూడా అన్ని కొత్త వాళ్లకే దక్కుతున్నాయని ఠాక్రే దృష్టికి తీసుకువెళ్లారు.

పీజేఆర్ కుటుంబానికి కూడా పార్టీలో గుర్తింపు కల్పించకపోతే ఎలా..? అని ఠాక్రేని విష్ణు ప్రశ్నించారని తెలుస్తోంది. గాంధీభవన్‌కు ఎందుకు రావడం లేదని ఈ సందర్భంగా ఠాక్రే ప్రశ్నించగా.. గాంధీభవన్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని.. అందువల్లే తాను రావడంలేదని విష్ణు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ పదవులు ముందు ముందు వస్తాయని ఠాక్రే చెప్పగా.. ఇప్పుడు పదవులు ఇస్తామన్నా.. తీసుకునే ఉద్దేశం లేదని విష్ణు తేల్చి చెప్పినట్లు స‌మాచారం.

First Published:  19 Jun 2023 11:42 AM GMT
Next Story