Telugu Global
Telangana

టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇప్పించిన విజయశాంతి

ఈ భయాన్ని నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి.. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ప్రస్తావించారు. టీడీపీతో పొత్తుపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆమె కోరారు.

టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇప్పించిన విజయశాంతి
X

తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చూపి.. ఇక్కడ మీకు మద్దతు ఇస్తాం.. ఏపీలో మాకు అండగా ఉండండి అని బీజేపీతో సంధి చేసుకునేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జ్ఞానేశ్వర్‌ను టీ-టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఖమ్మంలో ఒక సభ కూడా పెట్టారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్‌లోనూ సభలు పెడతామని ప్రకటించారు.

కేవలం బీజేపీని ఆకట్టుకునేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌కు తగిలిన షాక్‌ను తలచుకుని బీజేపీ నేతలు వణికిపోతున్నారు. చంద్రబాబు తన లాబీయింగ్ పవర్ అంతా ఉపయోగించి కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఒప్పిస్తారేమో అన్న ఆందోళన తెలంగాణ బీజేపీ నేతల్లో ఉంది.

ఈ భయాన్ని నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి.. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ప్రస్తావించారు. టీడీపీతో పొత్తుపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆమె కోరారు. ఆమె వినతికి ఎంపీ అరవింద్‌తో పాటు మరికొందరు నాయకులు కూడా మద్దతు పలికారు. ''అవును ఈ అంశంపై స్పష్టత ఇవ్వండి'' అని కోరారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే కాంగ్రెస్‌ భారీగా నష్టపోయిందని.. ఇప్పటికీ ఆ ప్రభావం నుంచి కాంగ్రెస్‌ కోలుకోలేకపోతుందని.. ఇప్పుడు మనం పొత్తు పెట్టుకున్నా అలాంటి పరిస్థితి వస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇందుకు స్పందించిన బండి సంజయ్.. టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకే కాకుండా ముఖ్యంగా ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

First Published:  31 Dec 2022 3:35 AM GMT
Next Story