నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది ఇక్కడ కాదు,మోడీ ఇంటి ముందు -కేటీఆర్
ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మోడీ సర్కార్ ఎందుకు భర్తీ చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ లక్షల మంది ఉద్యోగాలను ఊడబీకారని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగుల నోళ్ళల్లో మట్టి కొడుతున్న బీజేపీ ఇక్కడ నిరుద్యోగ మార్చ్ అని నాటకాలు ఆడితే తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.
హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో మోడీ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెపాడని, ఆ లెక్క ప్రకారం ఇప్పటి వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలేమయ్యాయని మోడీని ప్రశ్నించాలి. ఆయన ఇంటి ముందు ధర్నాలు, మార్చ్ లు చేయాలి అని కేటీఆర్ బీజేపీనేతలకు సూచించారు.
ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మోడీ సర్కార్ ఎందుకు భర్తీ చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ లక్షల మంది ఉద్యోగాలను ఊడబీకారని కేటీఆర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల నోళ్ళల్లో మట్టి కొడుతున్న బీజేపీ ఇక్కడ నిరుద్యోగ మార్చ్ అని నాటకాలు ఆడితే తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. మీ అబద్దాల ప్రచారాలు నమ్మడానికి ఇది ఎడ్డి తెలంగాణ కాదని కేటీఆర్ బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSCలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం పట్ల బీజేపీ కన్నా మాకే ఎక్కువ బాధ ఉన్నది. దీనివల్ల నిరుద్యోగులకు కలుగుతున్న అసౌకర్యం పట్ల మేము బాధ్యత వహిస్తున్నాం. పేపర్ లీకేజీ చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు. నిరుద్యోగులకు నష్టం కలగకుండా చూకునే బాధ్యత మాది అని చెప్పిన కేటీఆర్, TSPSC తో విద్యాశాఖకు, ఐటీ శాఖకు సంబంధం ఉండనే ఉండదు. అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అని తెలిపారు. కనీస జ్ఞానం లేని వారు ప్రతిపక్షంలో ఉండటం మన దురదృష్టం అని కేటీఆర్ విమర్శించారు.
బీజేపీ నాయకుల ఉచ్చులో పడకండి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడమే వారికి ఇష్టం లేదు. అందుకే వారు ''నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మాకు దగ్గర కాకుండా కుట్ర చేస్తున్నార''ని మాట్లాడారు. అటువంటి స్వార్దపరుల కుట్రలకు బలికావద్దని కేటీఆర్ యువతకు విజ్ఞప్తి చేశారు.