Telugu Global
Telangana

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల, జిట్టా, యెన్నం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నివాసానికి వెళ్లారు.

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల, జిట్టా, యెన్నం
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో పార్టీ చేరికకు రంగం సిద్ధమైంది. శనివారం CWC సమావేశాల కోసం హైదరాబాద్‌కు రానున్న AICC చీఫ్‌ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. తుమ్మలతో పాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరుతారని తెలుస్తోంది.

ఇక శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మలను ఆహ్వానించగా.. ఆయన ఓకే చెప్పారు. తుమ్మలను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు స్థానానికి పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో ఇద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది.

ఇక శుక్రవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జిట్టా బాలకృష్ణా రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డిని కలిసి చర్చించినట్లు తెలిపారు. జిట్టాకు భువనగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. మహబూబ్‌నగర్ స్థానం నుంచి యెన్నం టికెట్ ఆశిస్తున్నారు.

First Published:  16 Sep 2023 2:38 AM GMT
Next Story