Telugu Global
Telangana

ఆర్టీసీ బిల్లును ఆమోదించిన గవర్నర్

ముసాయిదా బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజే ఆర్టీసీ విలీన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు రాత్రికే బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్రవేస్తారని తెలుస్తోంది.

ఆర్టీసీ బిల్లును ఆమోదించిన గవర్నర్
X

ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు రాజ్ భవన్ రాజముద్ర పడింది. ముసాయిదా బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజే ఆర్టీసీ విలీన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు రాత్రికే బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్రవేస్తారని తెలుస్తోంది.

ఉదయం నుంచి..

ఈనెల 2వతేదీ మధ్యాహ్నం ఆర్టీసీ బిల్లుని గవర్నర్ కి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మూడు రోజులవుతున్నా బిల్లుకి ఆమోదముద్ర పడకపోవడంతో.. ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఈరోజు ఉదయం రెండు గంటలసేపు కార్మికులు సమ్మె నిర్వహించారు. అనంతరం రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వర్గాలు కార్మిక సంఘాల నేతల్ని లోపలికి పిలిచాయి. పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు.

మరోవైపు గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం పంపించింది. కార్మికుల జీతాలకు వచ్చే ఇబ్బందేమీ లేదని తెలిపింది. జీత భత్యాలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో విలీనం తర్వాత రూపొందించే గైడ్‌ లైన్స్‌ లో అన్ని అంశాలు ఉంటాయని పేర్కొంది. ఈ వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్, బిల్లుని ఆమోదిస్తున్నట్టు తెలిపారు. బిల్లుని రాజ్ భవన్ వర్గాలు అసెంబ్లీకి తీసుకెళ్లాయి.

ఆర్టీసీ కార్మికుల హర్షం..

ఆర్టీసీ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటం ఫలించిందని అన్నారు. ఈరోజు రాత్రికే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెడతారని, ఈరోజే ఈ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.

First Published:  5 Aug 2023 11:01 AM GMT
Next Story