Telugu Global
Telangana

రేవంత్‌రెడ్డి పోటీ చేసేది కొడంగల్ నుంచా? ఎల్బీనగర్ నుంచా?

ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి సేఫ్ సెగ్మెంట్ కోసం సలహా అడిగారు. జీహెచ్ఎంసీ పరిధిలో పోటీచేస్తే గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది

రేవంత్‌రెడ్డి పోటీ చేసేది కొడంగల్ నుంచా? ఎల్బీనగర్ నుంచా?
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే అనుమానం అందరిలో నెలకొంది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పోటీ చేసిన ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తన కంచుకోట అని భీరాలు పలికిన కొడంగల్ నియోజకవర్గం ప్రజలే రేవంత్ రెడ్డికి ఓటమి రుచి చూపించారు. ఆ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచి, టీపీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే తాజాగా రేవంత్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావడమే తన లక్ష్యం అని రేవంత్ ప్రతీసారి చెబుతూ వస్తున్నారు. రేవంత్ ఇంత కష్టపడేది కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావడానికి అయినా.. అంతిమ లక్ష్యం మాత్రం సీఎం సీటే అనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే రాజకీయం ప్రారంభించారు. ఏబీవీపీతో తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించినా.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రేవంత్.. ఆ తర్వాత ఇండిపెండెంట్‌గానే 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అయితే తెలంగాణలో రాజకీయ చిత్రం మారిపోవడంతో అనేక మంది పార్టీలు మారారు. రేవంత్ చాలా కాలం వెయిట్ చేసి 2017లో కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ నుంచి పోటీచేయగా.. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తిగా చెక్ పెట్టింది.

కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహం రచించి మరీ ఆయనను ఓడగొట్టింది. పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రేవంత్‌ను ఓడగొట్టే క్రమంలో అన్న పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ నుంచి ఓడిపోయారు. అయితే ఆ తర్వా త పట్నం బ్రదర్స్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై పట్టు సాధించారు. ఓడిపోయిన రేవంత్ రెడ్డి కసితో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. అయితే, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి ఆయన సీఎం రేసులో ఉంటారు. సీఎం కావాలంటే తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుపొందాలి. ఓడినా సరే ఎమ్మెల్సీగా గెలిచి సీఎం అయిపోతాను అనే మాటలు తెలంగాణ కాంగ్రెస్‌లో చెల్లవు. అందుకే రాబోయే ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై రేవంత్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొడంగల్ రేవంత్‌కు చాలా సేఫ్ సెగ్మెంట్. అయితే గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహం రచించి మరీ ఓడిపోయేలా చేశారు. తన కంచుకోట అనుకున్న సెగ్మెంట్‌లోనే ఓడిపోవడం రేవంత్‌కు భారీ అవమానాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎన్నికల బరిలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ మరింత ఫోకస్ చేస్తుందని రేవంత్ భావిస్తున్నారు. కంచుకోట అనుకున్న కొడంగల్‌లోనే ఓడిస్తే ఇక ఎక్కడి నుంచి పోటీ చేయాలని దారులు వెదుకుతున్నారు.

ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి సేఫ్ సెగ్మెంట్ కోసం సలహా అడిగారు. జీహెచ్ఎంసీ పరిధిలో పోటీచేస్తే గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఆ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో మేడ్కల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఎల్బీనగర్ అయితే రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి కూడా లేరు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్. కృష్ణయ్య తన వ్యక్తిగత చరిష్మాతో గెలిచారు. దీంతో రేవంత్ కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

కొడంగల్ తనకు కంచుకోట అయినా.. గత నాలుగేళ్లుగా మల్కాజ్‌గిరి ఎంపీగా ఉండటంతో ఎల్బీనగర్ ప్రజలకు రేవంత్ గుర్తుండిపోయారు. పైగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిచిన చరిత్ర లేదు. అందుకే ఎల్బీనగర్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  24 Sep 2022 1:01 PM GMT
Next Story