Telugu Global
Telangana

క్రిమినల్ కేసులు పెడతాం.. మీడియాకు రేవంత్ వార్నింగ్‌

రేవంత్‌ రెడ్డి మీడియాను బెదిరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ తమ వార్తలను ప్రసారం చేయడం లేదని బ్లాక్‌మెయిలింగ్‌, బెదిరింపులకు దిగారు.

క్రిమినల్ కేసులు పెడతాం.. మీడియాకు రేవంత్ వార్నింగ్‌
X

ఇప్పటివరకూ అధికారంలో ఉన్న పార్టీలు మాత్రమే మీడియాను బెదిరించడం చూశాం. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న‌ కాంగ్రెస్ నేతలు సైతం మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మీడియాపై త‌న అక్కసును వెళ్లగక్కారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్ నేతల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి మీడియాపై క్రిమినల్ కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్‌లోని అగ్రనేతల మధ్య విబేధాలు ఉన్నాయని కొన్ని ఛానల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్. తప్పుడు వార్తలతో కార్యకర్తల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి మీడియా రాజకీయ నిరసన‌ను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇందుకోసం స్పెషల్‌ టీం అపాయింట్ చేస్తామన్నారు రేవంత్. అలాంటి ఛానల్స్‌, పేపర్లను కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.

రేవంత్‌ రెడ్డి మీడియాను బెదిరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ తమ వార్తలను ప్రసారం చేయడం లేదని బ్లాక్‌మెయిలింగ్‌, బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ వార్తలను మొదటి పేజీలో అచ్చేయని పేపర్లను కొనుగోలు చేయొద్దని ప్రచారం చేస్తామన్నారు. ప్రకటనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. అవసరమైతే మీడియా ఛానల్స్ కేబుల్ నెట్‌వర్క్‌ల వైర్లను కూడా కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు తప్పుపడుతున్నాయి.

First Published:  11 Oct 2023 2:58 AM GMT
Next Story