Telugu Global
Telangana

ఆగని రేవంత్‌ బెదిరింపులు.. బోధన్‌ ఏసీపీకి వార్నింగ్.!

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. అయితే ఇదే సమయంలో బోధన్‌లో ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ఆగని రేవంత్‌ బెదిరింపులు.. బోధన్‌ ఏసీపీకి వార్నింగ్.!
X

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి బెదిరింపులకు దిగారు. ఈసారి బోధన్‌ ఏసీపీ కె.కిరణ్‌ కుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించొద్దంటూ హెచ్చరించారు. ఏసీపీ పేరు రెడ్‌ డైరీలో రాస్తున్నామని.. డిసెంబర్‌ 9 తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు.

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. అయితే ఇదే సమయంలో బోధన్‌లో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎమ్మెల్యే షకీల్‌ వాహనంపై బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు కార్యకర్తలను లాఠీఛార్జ్‌ చేసి చెల్లాచెదురు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. బోధన్ ఏసీపీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. రెడ్‌ డైరీలో పేరు రాస్తున్నామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు.

గతంలో మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చారు రేవంత్. అన్ని గుర్తుపెట్టుకుంటామని, పోలీసుల తప్పులన్నీ రెడ్‌ డైరీలో రాసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇటీవల జర్నలిస్టులను సైతం పండబెట్టి తొక్కుతానంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై జోరుగా చర్చ జరుగుతోంది.

First Published:  23 Nov 2023 5:41 AM GMT
Next Story