Telugu Global
Telangana

ఈటల కక్కలేక, మింగలేక.. రేవంత్ వ్యాఖ్యల కలకలం

రాజేందర్ తోపాటు, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో ఇమడలేకపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ సిద్ధాంతాలను వారు విశ్వసించబోరని చెప్పారు.

ఈటల కక్కలేక, మింగలేక.. రేవంత్ వ్యాఖ్యల కలకలం
X

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారా..? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీలో చేరారో.. ఆ లక్ష్యం నెరవేరదని డిసైడ్ అయ్యారా..? ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక రాజేందర్ ఇబ్బంది పడుతున్నారా..? బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులున్నారని ఆయన చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి..? ఆ వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా పట్టించుకోలేదు కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం రాజేందర్ వ్యాఖ్యల పరమార్థాన్ని బయటపెట్టారు. ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారని చెప్పారు. ఆ మాటకొస్తే రాజేందర్ తోపాటు, వివేక్ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో ఇమడలేకపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ సిద్ధాంతాలను వారు విశ్వసించబోరని, కేవలం కేసీఆర్ ని మాత్రమే వారు వ్యతిరేకిస్తారని చెప్పారు.

అందుకే ఓట్లు పడ్డాయి..

తెలంగాణలో రోజు రోజుకీ కాంగ్రెస్ బలహీన పడుతూ ఆమేరకు కాస్తో కూస్తో బీజేపీ బలపడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితోనే ఉన్నా.. కేసీఆర్ కావాలనే బీజేపీని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తున్నారని అంటారు ఆ పార్టీ నేతలు. ఒకరకంగా తమలోని అంతర్గత కుమ్ములాటల్ని, అసమర్థతను అలా కప్పి పుచ్చుకుంటారు. ఇటీవల హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కనీసం తన ఉనికి చాటుకోలేకపోయింది. దీంతో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఆయన ఈటల రాజేందర్ పై సాఫ్ట్ కార్నర్ చూపెడుతూ, కేసీఆర్ ని టార్గెట్ చేసి విమర్శలు సంధించారు.

ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తాం..

తాము కేంద్రంలో అధికారం చేపట్టాక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెడతామన్నారు రేవంత్ రెడ్డి. పదవుల్ని అనుభవిస్తూనే ఎడాపెడా పార్టీలు మారేవారికి చెక్ పెడతామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ట వయసుని 25 ఏళ్లనుంచి 21కి తగ్గిస్తామన్నారు. 21 ఏళ్లకు కలెక్టర్ అవగా లేనిది, ఎమ్మెల్యే అయితే తప్పేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

First Published:  26 Jan 2023 11:13 AM GMT
Next Story