Telugu Global
Telangana

ఆర్టీసీ బస్సు చోరీ.. ప్రయాణికుల టికెట్ల‌ డబ్బుతో దొంగ పరార్

మార్గమధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని వారికి టిక్కెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేశాడు. అయితే అది ఆర్టీసీ బస్సు కావడంతో ప్రయాణికులు అతడి తీరును అనుమానించలేదు.

ఆర్టీసీ బస్సు చోరీ.. ప్రయాణికుల టికెట్ల‌ డబ్బుతో దొంగ పరార్
X

ఇదొక చాక‌చ‌క్య‌మైన‌ దొంగతనం.. అసలు ఇలాంటి చోరి జరుగుతుంది అని ఊహించలేనంత విచిత్రమైన ఘటన. ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ ఎంచక్కా డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, కాసేపటి తరువాత బస్సులో డీజిల్ అయిపొయింది తీసుకొస్తా అని చెప్పి పరారయ్యాడు. సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..

సిరిసిల్ల జిల్లాకు చెందిన స్వామి అనే వ్యక్తి తన బస్సును ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి బస్సు డ్రైవర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద దాన్ని పార్క్ చేసి లాక్ వేయ‌డం మరచిపోయాడు. ఇదే అదునుగా భావించిన జిల్లాలోని గంభీరావు పేట మండలం శ్రీగాదకు చెందిన బందెల రాజు బస్సును దొంగిలించి డ్రైవ్ చేస్తూ వేములవాడకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని వారికి టిక్కెట్ ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేశాడు. అయితే అది ఆర్టీసీ బస్సు కావడంతో ప్రయాణికులు అతడి తీరును అనుమానించలేదు. ఈ లోపు సారంపల్లి-నేరెళ్ల మార్గంలో బస్సు తంగళపల్లి వద్ద ఆగిపోయింది. దీంతో కాసేపు చెక్ చేసినట్టు బిల్డప్ ఇచ్చిన రాజు డీజిల్ అయిపోయిందని, తీసుకొస్తానని చెప్పి వెళ్లిన డ్రైవ‌ర్ చాలా సమయం గడిచినా తిరిగి రాలేదు.

అయితే అటుగా వెళ్తున్న ఇతర ఆర్టీసీ బస్సు డ్రైవర్లు రోడ్డు మీద ఆగున్న బస్సును గమనించి అనుమానంతో కంట్రోలర్‌కు సమాచారం అందించారు. కంట్రోలర్ బస్సు యజమానికి విషయం తెలియజేయగా ఆయన వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ , ప్రయాణికులు తీసిన ఫొటోల ఆధారంగా నిందితుడు రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

First Published:  12 Sep 2023 5:15 AM GMT
Next Story