Telugu Global
Telangana

Sircilla: వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారు...అది కిడ్నాప్ కాదు, ప్రేమ వ్యవహారమే

శాలిని తండ్రి ఆమెకు పెళ్ళి నిశ్చయించాడు. ఆ పెళ్ళి ఇష్టం లేని శాలిని జాన్ ను పెళ్ళి చేసుకోవడానికి సిద్దమై ఈ రోజు ఉదయం తాము ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తున్నట్టు జాన్ కు సమాచారం ఇచ్చి అతనితో వెళ్ళి పోయింది. అనంతరం ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

Sircilla: వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారు...అది కిడ్నాప్ కాదు, ప్రేమ వ్యవహారమే
X

రాజన్న సిరిసిల్లా జిల్లాలో యువతి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. అది కిడ్నాప్ కాదని యువతి తన ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని తేలిపోయింది. ఆమె పెళ్ళి చేసుకొని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

చందుర్తి మండలం మూడేపల్లె గ్రామంలో ఈ రోజు తెల్లవారు జామున శాలిని అనే యువతి తన తండ్రితో సహా ఆ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడికి రాగా అక్కడికి ఓ కార్లో వచ్చిన కొందరు తండ్రిని పక్కకు తోసేసి అమ్మాయిని తీసుకొని పారిపోయారు. ఈ సంఘటన సీసీ టీవీ లో రికార్డ్ కాగా ఉదయం నుంచి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శాలిని తండ్రి జాన్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేశాడు.

గతంలో జాన్ అనే వ్యక్తి, శాలిని ప్రేమించుకొని పెళ్ళి కూడా చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పటికి శాలిని మైనర్ కావడంతో పోలీసులు జాన్ పై పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపారు. ఇప్పుడు మళ్ళీ శాలిని తండ్రి ఆమెకు మరో యువకుడితో పెళ్ళి నిశ్చయించాడు. ఆ పెళ్ళి ఇష్టం లేని శాలిని జాన్ ను పెళ్ళి చేసుకోవడానికి సిద్దమై ఈ రోజు ఉదయం తాము ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తున్నట్టు జాన్ కు సమాచారం ఇచ్చి అతనితో వెళ్ళి పోయింది. అనంతరం ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

శాలిని పెళ్ళి దుస్తుల్లోనే ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు జాన్ అంటే ఇష్టమని, మనస్పూర్తిగానే జాన్ తో కలిసి వెళ్ళిపోయానని ఆ వీడియోలో శాలిని చెప్పింది. తాము పెళ్ళి కూడా చేసుకున్నట్టు ఆమె తెలిపింది. జాన్ మొహానికి ముసుగు ఉండటం వల్ల ఆ సమయంలో అతన్ని గుర్తుపట్టలేదని ఆమె చెప్పింది. ఆ వీడియోలో శాలినితో పాటు జాన్ కూడా ఉన్నాడు.

First Published:  20 Dec 2022 10:34 AM GMT
Next Story