Telugu Global
Telangana

తెలంగాణలో గొర్రెల‌ పెంపకందార్ల జీవితాల్లో సమూల మార్పులు తీసుక వచ్చిన గొర్రెల పంపకం పథకం

ఐదేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా బంట్వారానికి చెందిన రైతు దంపతులు కల్‌కోడ చంద్రప్ప, అమృతమ్మ తమ ముగ్గురు పిల్లలకు రెండు పూటలా భోజనం పెట్టలేకపోయారు. వారికున్న‌ ఒక ఎకరం భూమిలో పత్తి, మొక్కజొన్న పంటలు పండించేవారు కానీ అది వారి తిండికే సరిపోకపోయేది.

తెలంగాణలో గొర్రెల‌ పెంపకందార్ల జీవితాల్లో సమూల మార్పులు తీసుక వచ్చిన గొర్రెల పంపకం పథకం
X

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపకం కార్యక్రమం గొర్రెల పెంపకం దార్ల జీవితాల్లో అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆకలితో, పేదరికంతో, చుట్టుముట్టిన కష్టాలతో బతుకీలీడ్చిన‌ వాళ్ళు ఈ రోజు గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా బంట్వారానికి చెందిన రైతు దంపతులు కల్‌కోడ చంద్రప్ప, అమృతమ్మ తమ ముగ్గురు పిల్లలకు రెండు పూటలా భోజనం పెట్టలేకపోయారు. వారికున్న‌ ఒక ఎకరం భూమిలో పత్తి, మొక్కజొన్న పంటలు పండించేవారు కానీ అది వారి తిండికే సరిపోకపోయేది. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అనేక ఇబ్బందులు పడేవారు.

అయితే ఈరోజు చంద్రప్ప కథ వేరేలా ఉంది. అతని పెద్ద కూతురు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, చిన్న కూతురు ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ దంపతుల ఏకైక కుమారుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు. తమ జీవితాల్లో మార్పుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఫ్లాగ్‌షిప్ గొర్రెల పంపిణీ కార్యక్రమమే కారణమంటున్నాడు చంద్రప్ప. అందుకాయన కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్తున్నాడు. అతనికిప్పుడు 80కి పైగా గొర్రెలున్నాయి. తన కుటుంబం ఇప్పుడు సంవత్సరానికి రూ. 9.6 లక్షలు సంపాదిస్తోందని చంద్రప్ప‌ చెప్పారు.

కురుమ సామాజిక వర్గానికి చెందిన చద్రప్ప రాష్ట్ర ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులలో ఒకరు. ప్రభుత్వం ఆయనకు ఫిబ్రవరి, 2018లో ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్‌ను మంజూరు చేసింది. గొర్రెలతో పాటు 206 కిలోల దాణా, రూ.400 విలువైన మందులను కూడా ప్రభుత్వం ఆయన ఇంటి వద్దకే పంపిణీ చేసింది.

స్థానిక పశువైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో చంద్రప్ప, అమృతమ్మ దంపతులు తమ గొర్రెలను 100 శాతం బతికించుకోగా, ఆ గొర్రెలు 24 ఆడ, 20 మగ మొత్తం 44 గొర్రెలకు జన్మనిచ్చాయి. 36 గొర్రె పిల్లలను అమ్మడం ద్వారా, మొదటి సంవత్సరంలో ఆ కుటుంబం రూ.2.1 లక్షలకు పైగా సంపాదించింది. చంద్రప్ప గొర్రెల పునరుత్పత్తి కోసం మరో రెండు పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మందలో 80కి పైగా గొర్రెలు ఉన్నాయి. అతని వార్షిక ఆదాయం రెండింతలు పెరిగి దాదాపు రూ.9.6 లక్షలకు చేరుకుంది.

చంద్రప్ప, అమృతమ్మలు ఇప్పుడు ఎలాంటి అప్పు తీసుకోకుండా ముగ్గురు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో విజయం సాధించారు. “ఈ పథకానికి ధన్యవాదాలు, మేము ఎటువంటి రుణం తీసుకోకుండానే ముగ్గురు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం'' అని అమృతమ్మ చెప్పారు.

నల్గొండ జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన బి భూలక్ష్మి, మంచిర్యాల జిల్లా సీతారాంపల్లెకు చెందిన ఎం శ్రీనివాస్ యాదవ్ వంటి ఎంతో మంది గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు చెందిన అనేక కుటుంబాలు గొర్రెల ద్వారా లబ్ధిపొందారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, గొర్రెల కాపరులకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశ కింద ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల యూనిట్ ధరతో 20 గొర్రెలను అందజేశారు. పథకం అమలు కోసం మొత్తం రూ.4,980.31 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 82.74 లక్షల గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి 3.92 లక్షల మంది ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల (పీఎస్‌బీసీఎస్) సభ్యులకు పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషి కారణంగా, ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల (PSBCS) సంఖ్య 8,109కి పెరిగింది. అందులో సభ్యుల సంఖ్య 3.92 లక్షల నుండి 7.61 లక్షల మందికి పెరిగింది. 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ పశుగణన ప్రకారం రాష్ట్రంలో గొర్రెల జనాభా కూడా గణనీయంగా పెరిగి 1.28 కోట్ల నుంచి 1.91 కోట్లకు చేరుకుంది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత‌ ఇప్పటి వరకు 1.30 కోట్ల గొర్రె పిల్లలు పుట్టగా, రూ.6,500 కోట్ల ఆదాయం వచ్చింది.

ఈ పథకం వల్ల తెలంగాణలో మాంసం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014-15లో 5.05 లక్షల టన్నుల మాసం ఉత్పత్తి జరగగా 2021-22 నాటికి 9.75 లక్షల టన్నులకు పెరిగి తెలంగాణ దేశంలోనే ఐదవ అతిపెద్ద మాంసం ఉత్పత్తిదారుగా నిలిచింది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ తర్వాత దేశంలో ఉన్ని ఉత్పత్తిలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. 2019-20లో తెలంగాణలో 3.96 లక్షల కిలోల ఉన్ని ఉత్పత్తి అయింది.

పథకం మొదటి దశ విజయవంతం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల మంది అర్హులైన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రెండవ దశ పంపిణీని ప్రారంభించింది. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుని గొర్రెల యూనిట్ ధరను కూడా రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు. రెండో దశ మొత్తం రూ.6,125 కోట్లు వ్యయం చేయనుంది ప్రభుత్వం.

First Published:  8 Jan 2023 3:51 AM GMT
Next Story