Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

టీఆరెస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లతో మొయినా బాద్ లోని ఫామ్ హౌజ్ లో బేరసారాలు సాగించి కొనుగోలుకు కుట్ర చేసిన నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలకు కోర్టు బెయిల్ ను తిరస్కరించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
X

టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇస్తే నిందితులు దర్యాప్తుకు ఆటంకం కలిగించే అవకాశం ఉందన్న పోలీసుల తరపు న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు వారికి బెయిల్ ను తిరస్కరించింది.

టీఆరెస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లతో మొయినా బాద్ లోని ఫామ్ హౌజ్ లో బేరసారాలు సాగించిన‌ ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి వంద కోట్లు ఇవ్వడానికి సిద్దమని చెప్పిన విషయం తెలిసిందే. నెంబర్ 2 బీజేపీ నాయకుడితో కూడా మాట్లాడిస్తామని, బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఈడీ, సీబీఐ, ఐటీల నుండి రక్షణ కల్పిస్తామని, అవసరమైతే కేంద్ర‍ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తుందని హామీలు కూడా గుప్పించారు.

వీరు బేరసారాలు ఆడుతున్న సమయంలోనే టీఆరెస్ ఎమ్మెల్యేల సహకారంతో వలపన్ని పట్టుకున్న పోలీసులు రోహిత్ రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.

మరో వైపు తమకు ఆ నిందితులకు ఏ సంబంధమూ లేదని చెప్పడానికి బీజేపీ నాయకులు వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం పటిష్టమైన సాక్షాధారాలతో మరింత మందిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా నిందితులో ఒకరైన హైదరాబాద్ కు చెందిన నంద కుమార్ పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. డెక్కన్ కిచెన్ యాజమాన్యంతో పాటు నందకుమార్‌ వద్ద స్థలం లీజుకు తీసున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

First Published:  14 Nov 2022 11:53 AM GMT
Next Story