Telugu Global
Telangana

దేశ జీడీపీలో పెరిగిన రాష్ట్ర వాటా.. దేశంలో అగ్రస్థానం తెలంగాణదే

2022-23లో తెలంగాణ రాష్ట్ర తలసరి జీడీపీ గురించి సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

దేశ జీడీపీలో పెరిగిన రాష్ట్ర వాటా.. దేశంలో అగ్రస్థానం తెలంగాణదే
X

దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ తలసరి సహకారం గత ఆరేళ్లలో 72 శాతం మేర పెరిగింది. దీని ప్రకారమే రాష్ట్రానికి పన్నుల కేటాయింపు జరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. 2022-23లో తెలంగాణ రాష్ట్ర తలసరి జీడీపీ గురించి సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

గత ఐదేళ్ల జీడీపీకి రాష్ట్ర తలసరి సహకారం విలువను కోరగా.. ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర జీడీపీ 2017-18లో రూ.1,79,358.. 2018-19లో రూ.2,09,942.. 2019-20లో రూ.2,31,326.. 2020-21లో 2,25,689.. 2021-22లో రూ.2,65,942.. 2022-23లో రూ.3,08,732గా నమోదైనట్లు తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటానే అత్యధికం అని.. ప్రస్తుతం ఆ రాష్ట్రమే టాప్‌లో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక రూ.3,01,673 హర్యానా రూ.2,96,685గా నమోదైనట్లు కేంద్ర మంత్రి రాజ్యసభలో పేర్కొన్నారు.

గడిచిన ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు అందించిన దాని కంటే తక్కువ ఆదాయ పంపిణీ పొందుతున్న రాష్ట్రాల వివరాలను అడిగినప్పుడు.. మంత్రి 15వ ఆర్థిక సంఘ సూత్రాన్ని వివరించారు. విభజించదగిన పూల్‌లో రాష్ట్రం వాటాను లెక్కించేటప్పుడు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం వాటాలు ఇవ్వడం అనేది సరైనది కాదని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రాష్ట్రాల వారీగా వచ్చిన ఆదాయ సమాచారాన్ని కేంద్ర నిర్వహించదని కూడా మంత్రి స్పష్టం చేశారు.

First Published:  11 Aug 2023 2:44 AM GMT
Next Story