Telugu Global
Telangana

కిక్కిరిసిన తెలంగాణ ఆర్టీసీ.. ఆదాయంలో రికార్డ్ బ్రేక్

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో 40 శాతం మంది మాత్రమే మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

కిక్కిరిసిన తెలంగాణ ఆర్టీసీ.. ఆదాయంలో రికార్డ్ బ్రేక్
X

తెలంగాణ ఆర్టీసీ ఆదాయం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది. ఈ ఆదాయం టికెట్ల రూపంలో కనపడుతున్నా, ప్రభుత్వం నుంచి నిధులు తిరిగి వస్తేనే ఆర్టీసీ ఆదాయం కళ్లజూడగలదు. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగినట్టు చెబుతున్నారు అధికారులు. ఆమేరకు తాజా గణాంకాలు విడుదల చేశారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి రూ.21.10 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు.

మహిళలకు మహాలక్ష్మి.. ఆర్టీసీకి ధన లక్ష్మి

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం.. ఆర్టీసీకి ధన లక్ష్మిలా మారింది. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా సందు లేనంతగా జనాభా నిండిపోతున్నారు. ఈ నెల9న పథకం ప్రారంభమైన తర్వాత ఈనెల 18న(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది ఆర్టీసీ బస్సులెక్కారు. వివిధ రకాల బస్ పాసులు ఉన్న వారిని మినహాయిస్తే 48.5 లక్షల మందికి సోమవారం ఆర్టీసీ టికెట్‌లు జారీ చేసింది. ఇందులో 30.16 లక్షల మంది మహిళలు కాగా వారికి జీరో టికెట్ లు జారీ చేశారు.

నాడు-నేడు..

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో 40 శాతం మంది మాత్రమే మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రీయింబర్స్‌ మెంట్‌ తో కలిపితే ఆర్టీసీ ఒకరోజు గరిష్ట ఆదాయం రూ.21.10 కోట్లకు చేరింది. రాష్ట్రంలో సోమవారం కేవలం 33.36 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగినా ఆదాయం మాత్రం గరిష్టానికి చేరుకుంది. ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 97.31 శాతానికి పెరిగింది. గతంలో పండగల సమయంలో కూడా ఈ స్థాయిలో ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. కానీ మహిళల ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీకి ప్రతి రోజూ పండగలానే మారింది.

First Published:  20 Dec 2023 4:22 AM GMT
Next Story