Telugu Global
Telangana

తెలంగాణ: విద్యుత్ డిమాండ్ లో కొత్త రికార్డు

రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2014లో 7,778 మెగావాట్ల నుంచి 2022 నాటికి 18,460 మెగావాట్లకు పెంచామని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ: విద్యుత్ డిమాండ్ లో కొత్త రికార్డు
X

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ శుక్రవారం నాడు కొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం గరిష్టంగా 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించిందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. గత ఏడాది మార్చి 29న అత్యధికంగా 14,166 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.

అసెంబ్లీలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సగటు 1,255 యూనిట్లు ఉండగా తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,166 యూనిట్లుగా ఉందన్నారు. “గత కొన్ని రోజులుగా నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతర విద్యుత్ సరఫరాలో చిన్నపాటి అంతరాయాలు ఉన్నాయి. కానీ నేటి నుంచి ఆ సమస్య లేదు. ”అని ఆయన ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2014లో 7,778 మెగావాట్ల నుంచి 2022 నాటికి 18,460 మెగావాట్లకు పెంచామని వివరించారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొందిన రుణాలపై ఆంక్షలతో పాటు కేంద్రం అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి మండిపడ్డారు. టన్నుకు కేవలం రూ.3,600కు లభించే దేశీయ బొగ్గును కాదని, టన్నుకు రూ.40,000 చొప్పున దిగుమతి చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.

"మేము రాష్ట్రం వెలుపల ఉన్న NTPC, ఇతర పవర్ ప్లాంట్ల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నందున, దిగుమతి చేసుకున్న బొగ్గును కొనుగోలు చేయడానికి మేము నిరాకరించినప్పటికీ, కేంద్రం ఆదేశం మా విద్యుత్ కొనుగోలు వ్యయంపై చాలా భారాన్ని కలిగిస్తోంది" అని ఆయన చెప్పారు.

First Published:  11 Feb 2023 2:24 AM GMT
Next Story