Telugu Global
Telangana

తెలంగాణలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా 'పీజీ' చదువుతున్నారు

పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులపై పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ లో పీజీ చేస్తున్న స్త్రీలు పురుషులకన్నా రెట్టింపు ఉన్నారు.

తెలంగాణలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా పీజీ చదువుతున్నారు
X

తెలంగాణలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులపై ఆసక్తి చూపుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) 2022కి వచ్చిన రిజిస్ట్రేషన్ల సంఖ్యే దీనికి సాక్ష్యం

ప్రవేశ పరీక్షలకు మొత్తం 67,115 దరఖాస్తులు రాగా, మహిళల నుంచి 44,892, పురుషుల నుంచి 22,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. పీజీ కోర్సులను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న మహిళల సంఖ్య పురుషుల కంటే రెట్టింపుగా ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర లింగానికి చెందిన ఇద్దరు కూడా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

"గత సంవత్సరం CPGET ద్వారా 16,000 మంది మహిళలు అడ్మిషన్లు తీసుకోగా, 6,000 మంది పురుషులు మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు" అని CPGET 2022 కన్వీనర్, ప్రొఫెసర్ ఐ పాండు రంగారెడ్డి తెలిపారు.

కెమిస్ట్రీ, కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఓయూ అధికారులు తెలిపారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- క్యాంపస్, అనుబంధ కళాశాలలు అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం CPGET నిర్వహించబడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఫర్ ఉమెన్‌ని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడంతో, మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ అడ్మిషన్లు కూడా CPGET ద్వారానే జరుగుతాయి.

45 సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో ఆగస్టు 11 నుంచి 22 వరకు జరుగుతుంది. రోజుకు మూడు సెషన్లలో అంటే ఉదయం 9.30 నుంచి 11, మధ్యాహ్నం 1 నుంచి 2.30, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది.

పరీక్షలకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 8 నుండి https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా కేటాయించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు రిపోర్ట్ చేయాలని సూచించారు.

First Published:  1 Aug 2022 3:24 AM GMT
Next Story