Telugu Global
Telangana

ఆడబిడ్డపై మీ ప్రతాపమా..? పారిపోయినోళ్లు ఎక్కడున్నారు..?

మార్చిలో కవితను ఈడీ విచారణకు పిలిచిందని, కానీ ఫోన్లు ధ్వంసం చేశారని నవంబర్‌ లోనే ప్రచారం చేశారని విమర్శించారు. ఒక మహిళ గురించి ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యత ఉండాలన్నారు. ఎలాంటి ఆధారాలతో కిషన్‌ రెడ్డి ఆరోపణలు చేశారని ప్రశ్నించారు.

ఆడబిడ్డపై మీ ప్రతాపమా..? పారిపోయినోళ్లు ఎక్కడున్నారు..?
X

నేరం రుజువు కాకముందే కవితను దోషిలా చూస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండానే స్కామ్ అంటున్నారని.. కేంద్రంపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆడబిడ్డపై మీ ప్రతాపమా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విలువ 100 కోట్లు అయితే.. మీ నీరవ్‌ మోదీ ఎన్నికోట్ల స్కామ్‌ చేశారు? లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా ఎక్కడున్నారని ప్రశ్నించారు. లక్షల కోట్ల స్కాంలు వదిలేసి వందకోట్ల కేసు వెంటపడుతున్నారని అన్నారు. మహిళ అని చూడకుండా కవితను 10 రోజులుగా ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు. లేని ఆధారాలు ఉన్నట్లు సృష్టించి వేధిస్తున్నారని.. కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సెల్‌ ఫోన్లు ధ్వంసం చేశారన్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కవిత ఈరోజు ఫోన్లు చూపించింది కదా ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ధ్వంసం చేయని ఫోన్లను చేశారంటూ ప్రచారం చేశారని, కిషన్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు. అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిలో కవితను ఈడీ విచారణకు పిలిచిందని, కానీ ఫోన్లు ధ్వంసం చేశారని నవంబర్‌ లోనే ప్రచారం చేశారని విమర్శించారు. ఒక మహిళ గురించి ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యత ఉండాలన్నారు. ఎలాంటి ఆధారాలతో కిషన్‌ రెడ్డి ఆరోపణలు చేశారని ప్రశ్నించారు.

వారి సంగతేంటి..?

దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని ఎందుకు రప్పించడం లేదని సూటిగా ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. వారంతా మోదీకి కావాల్సినవారు కావడంతోనే వారు తప్పులు చేసినా పట్టించుకోవట్లేదని, ప్రతిపక్షాలకు చెందిన నేతల్ని మాత్రం తప్పుడు కేసుల్లో ఇరికించి భయపెడుతున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులున్న వారు బీజేపీలో చేరితే వారిని వదిలేస్తున్నారని, కేసులను ఎదురొడ్డి పోరాటం చేసినవారిని మాత్రం మరింతగా వెంటాడుతున్నారని అన్నారు.

First Published:  21 March 2023 10:03 AM GMT
Next Story