Telugu Global
Telangana

అందులో దోఖా, ఇందులో సక్సెస్.. అసెంబ్లీలో బీజేపీకి చాకిరేవు

ఈటల తమ దగ్గర ఉన్నప్పుడు జన్ కీ బాత్ వినేవారని, ఇప్పుడు మన్ కీ బాత్ వింటున్నారని అన్నారు. కాషాయ పార్టీ లో చేరిన తర్వాత ఏం కషాయం తాగించారో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అందులో దోఖా, ఇందులో సక్సెస్.. అసెంబ్లీలో బీజేపీకి చాకిరేవు
X

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడేసుకున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కేంద్రంలోని బీజేపీ ఎందులో మోసం(దోఖా) చేసింది, ఎందులో సక్సెస్ అయింది అంటూ ఆయన ఓ లిస్ట్ వినిపించారు.

దోఖా ఎందులోనంటే..?

సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు – ధోఖా

అర్హులైన వారందరికీ ఇళ్లు – ధోఖా

రైతుల ఆదాయం రెట్టింపు – ధోఖా

పటిష్టమైన లోక్ పాల్ బిల్లు – ధోఖా

నదుల అనుసంధానం – ధోఖా

హరీష్ రావు ఆ లిస్ట్ చదువుతుంటే.. సభ్యులంతా దోఖా దోఖా అంటూ హోరెత్తించారు. అయితే కొన్ని విషయాల్లో కేంద్రంలోని బీజేపీ సక్సెస్ అయిందని కూడా అన్నారు హరీష్ రావు..

సక్సెస్ ఎందులోనంటే..?

జీడీపీని మంటగలపడంలో – సక్సెస్

ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో – సక్సెస్

160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో – సక్సెస్

సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో – సక్సెస్

ఆకాశాన్ని తాకేటట్టు సిలిండర్ ధర పెంచడంలో – సక్సెస్

పసిపిల్లలు తాగే పాల మీద జీఎస్టీ విధించడంలో – సక్సెస్

ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో – సక్సెస్

ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో – సక్సెస్

రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో – సక్సెస్

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో – సక్సెస్

ఆదానీ ఆస్తులు పెంచడంలో – సక్సెస్

రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో - సక్సెస్

మతపిచ్చి మంటలు రేపడంలో..... డబుల్ సక్సెస్ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడేసుకున్నారు హరీష్ రావు.


అప్పుడు జన్ కీ బాత్, ఇప్పుడు మన్ కీ బాత్..

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కూడా సెటైర్లు పేల్చారు హరీష్ రావు. ఈటల తమ దగ్గర ఉన్నప్పుడు జన్ కీ బాత్ వినేవారని, ఇప్పుడు మన్ కీ బాత్ వింటున్నారని అన్నారు. కాషాయ పార్టీ లో చేరిన తర్వాత ఏం కషాయం తాగించారో అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌ లో కపిల గోవుకు పూజలు చేస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని యూనివర్శిటీల్లోనే తాంత్రిక, చేతబడి కోర్సులు పెట్టారని, తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యమని అన్నారు హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కవులు అయ్యారని క అంటే కనపడదు.. వి అంటే వినపడదు అంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రాష్ట్రంలోని రైతులు సంబరపడుతుంటే, ఇకపై అధికారం రాదేమోనని విపక్షాలు బాధపడుతున్నాయని అన్నారు హరీష్ రావు అన్నారు. ప్రజలకు కావాల్సినంత పవర్‌(కరెంటు) ఇచ్చినందునే తమకు పవర్‌(అధికారం) ఇచ్చారని చెప్పారు. పవర్‌ హాలిడే ఇచ్చినందునే కాంగ్రెస్‌ కు ప్రజలు ‘హాలిడే’ ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమృత్‌ కాల్‌ అని చెప్పుకుంటున్న బీజేపీ పాలన, దేశప్రజలకు ఆపద కాలంలా మారిందన్నారు.

First Published:  8 Feb 2023 11:49 AM GMT
Next Story