Telugu Global
Telangana

సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌‌ షేక్‌‌ పేట్‌‌ లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించింది. అయితే ఈ భూమిని దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో సహా ఇతరులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు
X

సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు

సినిమాలు తీయకపోయినా ఇటీవల కాలంలో దర్శకుడు రాఘవేంద్రరావు తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. చంద్రబాబు జైలు వ్యవహారంలో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లు వైరల్ గా మారాయి. టీడీపీకి మద్దతుగా ట్వీట్లు వేస్తూ, లోకేష్ పిలుపునిచ్చిన నిరసనల్లో తప్పనిసరిగా పాల్గొంటూ రాఘవేంద్రరావు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా కోర్టు కేసులతో వార్తల్లోకెక్కారు. ఆయనకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని విలువైన భూమి విషయంలో ఆయన కోర్టు కేసులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌‌ బంజారాహిల్స్‌‌ ఏరియాలోని షేక్‌‌ పేట్‌‌ లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించింది. అయితే ఈ భూమిని దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో సహా ఇతరులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈమేరకు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మెదక్‌‌ కు చెందిన బాలకిషన్‌‌ 2012లో పిల్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాఘవేంద్రరావు సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది.

ఈ ఏడాది మార్చిలోనే ఈ పిల్ విచారణలో రాఘవేంద్రరావుకి నోటీసులు జారీ చేసింది కోర్టు. అయితే అవి ఆయనకు అందినట్టుగా రికార్డుల్లో లేకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. బంజారాహిల్స్‌‌ సర్వే నెం. 403/1లో 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. రాఘవేంద్రరావు సహా ఆయన బంధువులు కృష్ణమోహన్​ రావు, చక్రవర్తి, విజయ లక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి కోర్టు నోటీసులిచ్చింది.

First Published:  10 Nov 2023 2:28 AM GMT
Next Story