Telugu Global
Telangana

తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ లు..

ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌ లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచానికి ఔషధాలు, వ్యాక్సిన్ల హబ్ గా హైదరాబాద్ తయారైందన్నారు.

తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ లు..
X

తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ లు రూపొందిస్తున్నట్టు దావోస్ నుంచి ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఆయన.. 'హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ' అంశంపై ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేస్తామన్నారు. డిజిటల్‌ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడతామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.

అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌ లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచానికే ఔషధాలు, వ్యాక్సిన్ల హబ్ గా హైదరాబాద్ తయారైందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు తెలంగాణ ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణలో వైద్య రంగం అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య వివరాల డిజిటలీకరణ మొదలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణ కూడా డిజిటలీకరణ మొదలుపెట్టబోతోంది. ఆ వివరాలన్నీ డిజిటల్ హెల్త్ కార్డ్ లలో నమోదు చేయబోతున్నారు.

First Published:  18 Jan 2024 3:15 AM GMT
Next Story