Telugu Global
Telangana

ఊరూరా పండుగలా దశాబ్ది ఉత్సవాలు : మంత్రి సబిత ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు.

ఊరూరా పండుగలా దశాబ్ది ఉత్సవాలు : మంత్రి సబిత ఇంద్రారెడ్డి
X

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఊరూరా పండుగలా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రాడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేటలోని ఎస్‌వైఆర్ గార్డెన్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రతీ ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాయని సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బందు, రైతు భీమా ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఇదంతా కేసీఆర్ దార్శనికత వల్లే సాధ్యమైందని ఆమె ప్రశంసించారు.

ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని.. ఉత్సవాల విజయవంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.

సంక్రాంతిని మరిపించేలా దశాబ్ది ఉత్సవాలు : మంత్రి జగదీశ్ రెడ్డి

సంక్రాంతిని మరిపించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పురోగతి వర్తమానానికి మార్గదర్శనం అయ్యేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్దిదారులతో పాటు ప్రజలు కూడా సంబరాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం జలాల తొలి ఫలం అందుకున్నది సూర్యపేట జిల్లానే అని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. సూర్యపేట నియోజకవర్గంలో త్రివేణి సంగమం ఏర్పడిందని.. అది సీఎం కేసీఆర్ ఘనతని జగదీశ్ రెడ్డి చెప్పారు.

First Published:  1 Jun 2023 2:55 PM GMT
Next Story