Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు చెరువుల పండగ

మత్స్యకారులు వలల ఊరేగింపుతో గ్రామంలో సందడి చేస్తారు. చెరువుల పండగ సందర్భంగా చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

దశాబ్ది సంబరం.. నేడు చెరువుల పండగ
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఏడో రోజుకి చేరుకున్నాయి. ఈరోజు ఊరూరా చెరువుల పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యవసాయ రంగానికి అత్యథిక ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, భూగర్భ జలాల పెంపుకోసం చెరువుల పరిరక్షణ మొదలు పెట్టింది. చెరువులు.. వ్యవసాయదారులతోపాటు మత్స్యకారులకు కూడా జీవనాధారం. ఈరోజు ఊరూరా చెరువుల పండగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

బోనాలు, బతుకమ్మలు, చెరువుకట్టపై సభలు..

తెలంగాణ గ్రామాల్లో నేడు చెరువుల వద్ద పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. చెరువులు, తెలంగాణ సంస్కృతిపై వివిధ పాటలను స్థానిక కవులు, గాయలుకు వినిపిస్తారు. మత్స్యకారులు వలల ఊరేగింపుతో గ్రామంలో సందడి చేస్తారు. చెరువుల పండగ సందర్భంగా చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

తెలంగాణ చెరువుల చరిత్ర ఇది..

1956 నాటికి తెలంగాణలో 70 వేల చెరువుల కింద దాదాపు 25 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండేదని సమాచారం. 2014 నాటికి 46,531 చెరువులు మాత్రమే మిగిలాయి. వాటిలో సగం ఎండిపోయాయి. దీంతో రైతులు బోరుబావులపైనే ఎక్కువగా ఆధారపడేవారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరుబావులు కూడా ఎండిపోయి దిగాలు పడ్డారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పులొచ్చాయి. మన ఊరు- మన చెరువు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయతో దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగలా మార్చారు. ఆ విజయానికి గుర్తుగా ఈరోజు చెరువుల పండగ జరుపుకుంటున్నారు.

First Published:  8 Jun 2023 2:18 AM GMT
Next Story