Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవాలు.. తెలంగాణ ప్రజలకు పండగ రోజులు

దశాబ్ది ఉత్సవాల కొనసాగింపుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. జూన్‌ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

దశాబ్ది ఉత్సవాలు.. తెలంగాణ ప్రజలకు పండగ రోజులు
X

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారైంది. 21రోజులపాటు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జూన్ 2

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ జూన్ 2న లాంఛనంగా ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పిస్తారు. ఆ తర్వాత సచివాలయంలో జెండా ఆవిష్కరిస్తారు. దశాబ్ది ఉత్సవాల సందేశం వినిపిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం ఉంటుంది.

జూన్ 3

జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేస్తారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు రైతులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు.

జూన్ 4

జూన్ 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘‘సురక్షా దినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించేలా జిల్లా స్థాయిలో కార్యక్రమాలుంటాయి.

జూన్ 5

జూన్ 5న ‘‘తెలంగాణ విద్యుత్ విజయోత్సవం’’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలుంటాయి. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. అదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

జూన్ 6

జూన్ 6న ‘‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’’ జరుగుతుంది. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తారు.

జూన్ 7

జూన్ 7వ తేదీ ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు.

జూన్ 8

జూన్ 8న ‘‘ఊరూరా చెరువుల పండుగ’’ నిర్వహిస్తారు. బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో చెరువుల పండగను ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

జూన్ 9

జూన్ 9న ‘‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. అదే రోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సభ ఉంటుంది.

జూన్ 10

జూన్ 10వ తేదీన ‘‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేస్తారు.

జూన్ 11

జూన్ 11వ తేదీన ‘‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’’ నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తారు.

జూన్ 12

జూన్ 12న ‘‘తెలంగాణ రన్’’ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

జూన్ 13

జూన్ 13న ‘‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’’ నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.

జూన్ 14

జూన్ 14న ‘‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవా’’న్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ది గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

జూన్ 15

జూన్ 15 గురువారం ‘‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’’ జరుపుతారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

జూన్ 16

జూన్ 16న ‘‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’’ నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలుపుతారు.

జూన్ 17

జూన్ 17వ తేదీ ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.

జూన్ 18

జూన్ 18న ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్ 19

జూన్ 19న ‘‘తెలంగాణ హరితోత్సవం’’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.

జూన్ 20

జూన్ 20న ‘‘తెలంగాణ విద్యాదినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున మన ఊరు - మన బడి కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ని ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.

జూన్ 21

జూన్ 21వ తేదీ ‘‘ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

జూన్ 22

జూన్ 22వ తేదీ ‘‘అమరుల సంస్మరణ’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.

దశాబ్ది ఉత్సవాల కొనసాగింపుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. జూన్‌ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జులై నుంచి గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని కూడా సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

First Published:  23 May 2023 4:32 PM GMT
Next Story