Telugu Global
Telangana

పందెం కట్టారు.. తండ్రి చనిపోతుంటే వీడియో తీశారు

కళ్లముందే తండ్రి చెరువులో మునిగిపోతుంటే కాపాడాల్సిన కొడుకులు, తండ్రి పందెంలో ఓడిపోతున్నాడని సంబరపడ్డారు. తమ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి వీడియో తీశారు.

పందెం కట్టారు.. తండ్రి చనిపోతుంటే వీడియో తీశారు
X

పందెం కట్టారు.. తండ్రి చనిపోతుంటే వీడియో తీశారు

తండ్రి చావుకి కారణం అయ్యారు ఆ కొడుకులు, తండ్రితో పందెం కట్టి ఆయన చనిపోతుంటే కాపాడాల్సింది పోయి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. మద్యం మత్తులో ఈ దారుణం జరిగినా.. కనీసం తండ్రి అనే జాలి కూడా లేకుండా ఆ కొడుకులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఈ దుర్మార్గం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో జరిగింది.

కొడుకుల కళ్లముందే తండ్రి చెరువులో మునిగి చనిపోయాడు. ఇది విషాదమే. కానీ ఇది విషాదాన్ని మించిన దుర్మార్గం. అవును, ఆ చావుకి కారణం ఆయన ఇద్దరు కొడుకులు. చెరువు ఈ గట్టునుంచి ఈదుకుంటూ ఆ గట్టుకి వెళ్లాలంటూ తండ్రితోనే పందెం కట్టాడు కొడుకు. అప్పటికే తండ్రి ఇద్దరు కొడుకులు మద్యం మత్తులో ఉన్నారు. ఆ మత్తులో పందెం గెలిచేందుకు తండ్రి మరో కొడుకు ప్రయత్నం చేశారు. కొడుకు హుషారుగా ఈదుకుంటూ అవతలివైపు వెళ్లాడు. కానీ తండ్రి మధ్యలోనే మునిగిపోయాడు. చెరువులో మునిగి చనిపోయాడు. కఠినాత్ములైన ఆ కొడుకుల కన్నతండ్రి కృష్ణయ్య. ఆయన చావుకి కారణమైన ఆ ఇద్దరు కొడుకులు ఉదయ్ కుమార్, రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

కాపాడాల్సిందిపోయి..

కళ్లముందే తండ్రి మునిగిపోతుంటే కాపాడాల్సిన కొడుకులు, తండ్రి పందెంలో ఓడిపోతున్నాడని సంబరపడ్డారు. తమ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి వీడియో తీశారు. కనీసం తండ్రిని కాపాడాలన్న స్పృహ కూడా వారికి లేకుండా పోయింది. చివరకు తండ్రి చనిపోయాక శవాన్ని చెరువులోనుంచి బయటకు తీసారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పోలీసులకు తెలియడంతో తండ్రి చావుకి కారణం అయిన వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First Published:  2 Dec 2022 10:48 AM GMT
Next Story