Telugu Global
Telangana

పొత్తు వద్దు.. మద్దతివ్వండి.. లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్‌ మొండిచేయి

లెఫ్ట్ పార్టీలకు ఇస్తానన్న నాలుగు సీట్లలో చెన్నూరు సీటును వివేక్‌ వెంకట స్వామి కొడుకు గడ్డం వంశీకి, కొత్తగూడెం స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంకట్రావుకు కేటాయించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పొత్తు వద్దు.. మద్దతివ్వండి.. లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్‌ మొండిచేయి
X

కామ్రేడ్లకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్‌ ఇవ్వనుందా..! లెఫ్ట్ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ హామీని పక్కకుపెట్టిందా.! అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజా పరిణామాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముందుగా లెఫ్ట్ పార్టీలకు ఇస్తామన్న నాలుగు స్థానాల్లో తమకే విజయావకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

దీంతో లెఫ్ట్ పార్టీల ముందు కాంగ్రెస్ కొత్త ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే చెరో రెండు ఎమ్మెల్సీలు, చెరో మంత్రి పదవి ఇస్తామని ఆఫ‌ర్ చేసినట్లు సమాచారం. దీంతో లెఫ్ట్ పార్టీలు పొత్తుపై పునరాలోచలనలో పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఎం ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు సీపీఐ నేతలు ఇవాళ సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు.

లెఫ్ట్ పార్టీలకు ఇస్తానన్న నాలుగు సీట్లలో చెన్నూరు సీటును వివేక్‌ వెంకట స్వామి కొడుకు గడ్డం వంశీకి, కొత్తగూడెం స్థానాన్ని ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంకట్రావుకు కేటాయించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లెఫ్ట్‌ పార్టీలు కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సీట్లు కోరడం.. అక్కడ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన‌ అభ్యర్థులు ఉండటంతో సీట్ల పంపిణీ జాప్యం అవుతూ వచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్‌తో పాటు లెఫ్ట్ పార్టీల నుంచి అధికారిక ప్రకటన ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే లెఫ్ట్ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.

First Published:  1 Nov 2023 2:41 AM GMT
Next Story