Telugu Global
Telangana

కుదరని కుల సమీకరణం.. కాంగ్రెస్‌పై అసంతృప్తి

బీసీల్లో మెజార్టీ జనాభా గౌడ, యాదవ సామాజిక వర్గాలది. ఈ రెండు వర్గాల నుంచి కూడా ఒక్కరికి టికెట్ దక్కలేదు. భువనగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరకు చామల కిరణ్‌ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది.

కుదరని కుల సమీకరణం.. కాంగ్రెస్‌పై అసంతృప్తి
X

కాంగ్రెస్‌ ఇప్పటివరకూ తెలంగాణలోని 14 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 పార్లమెంట్‌ స్థానాలు కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ప్రకటించిన 14 స్థానాల్లో 6 స్థానాలు రెడ్డిలకే దక్కాయి. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగ, గౌడ, యాదవ సామాజిక వర్గాలకు ఒక్క టికెట్ కూడా దక్కలేదు.

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై మాదిగలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉండగా.. మాదిగ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. తెలంగాణలో దాదాపు 50 లక్షలకుపైగా మాదిగలు ఉన్నట్లు సమాచారం. ఎస్సీల్లో ఈ సామాజిక వర్గం జనాభానే ఎక్కువ. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి మాల సామాజిక వర్గం, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ మాల సామాజికవర్గానికి టికెట్లు కేటాయించారు. ఇక వరంగల్‌లో మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు టికెట్ దక్కింది.

బీసీల్లో మెజార్టీ జనాభా గౌడ, యాదవ సామాజిక వర్గాలది. ఈ రెండు వర్గాల నుంచి కూడా ఒక్కరికి టికెట్ దక్కలేదు. భువనగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరకు చామల కిరణ్‌ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక యాదవ సామాజిక వర్గానికి కూడా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న హైదరాబాద్ స్థానం యాదవులకు ఇస్తారని సమాచారం. ఇక పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ స్థానాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు దక్కుతాయని తెలుస్తోంది.

First Published:  2 April 2024 5:02 AM GMT
Next Story