Telugu Global
Telangana

3రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయం

తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ముందుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. కంటోన్మెంట్‌ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని చెప్పారాయన.

3రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయం
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడురోజులపాటు జరుగుతాయి. ఈమేరకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి బీఏసీ మీటింగ్ కి హాజరు కాగా.. కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నుంచి అక్భరుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ తీర్మానించింది. శుక్రవారం వరదలపై అసెంబ్లీలో చర్చిస్తారు. వివిధ బిల్లులపై శనివారం అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ పని దినాలు కనీసం 10రోజులు ఉండాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కానీ చివరకు మూడు రోజులే సమావేశాలు జరుగుతాయని బీఏసీ తీర్మానించింది.

తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ముందుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. కంటోన్మెంట్‌ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని చెప్పారాయన. సాయన్నతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న.. నిత్యం ప్రజలతో మమేకమై నిరాడంబరంగా ఉండేవారని పేర్కొన్నారు. ఇతర సభ్యులు కూడా సాయన్నతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవన విధానాన్ని కొనియాడారు. ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా సభ సంతాపం ప్రకటించింది. సంతాపం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.


అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు దూరంగా ఉండటం విశేషం. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వనమా నిర్ణయం తీసుకోగా.. జలగం వెంకట్రావును ఇంకా ఎమ్మెల్యేగా పరిగణించని కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.

First Published:  3 Aug 2023 8:48 AM GMT
Next Story