Telugu Global
Telangana

పెళ్లి చేయ‌ట్లేద‌ని.. క‌న్న‌త‌ల్లిని హ‌త‌మార్చాడు

గతంలో ఓ విద్యుత్ ప్రమాదంలో కుమారుడు ఈశ్వర్ చేతికి గాయాలు కాగా.. వైద్యులు అత‌ని చేతిని తొల‌గించారు. అత‌నికి ఒక చేయి లేక‌పోవ‌డంతో పెళ్లి కావ‌డం లేదు.

పెళ్లి చేయ‌ట్లేద‌ని.. క‌న్న‌త‌ల్లిని హ‌త‌మార్చాడు
X

చెయ్యి లేని కొడుక్కి పిల్ల‌నిచ్చేందుకు ఎవ‌రూ ముందుకురాక ఆ త‌ల్లి త‌ల్ల‌డిల్లుతుంటే.. త‌న‌కు పెళ్లి చేయ‌డం లేద‌నే కోపంతో కొడుకు ఆ త‌ల్లిని దారుణంగా హ‌త‌మార్చాడు. అంతేకాదు.. ఆ హ‌త్య నుంచి త‌ప్పించుకునేందుకు దొంగ‌లు ఆ ప‌ని చేశారంటూ పోలీసుల‌ను, త‌న సోద‌రిని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. అందులో భాగంగా ఆమె కాళ్లు రెండూ న‌రికేసి కాళ్ల‌కు ఉన్న క‌డియాలు తీసేశాడు. ఆ క‌డియాల కోసం దొంగ‌లు హ‌త్య చేశార‌ని పోలీసుల‌కు చెప్పాడు.

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో జరిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. బండమైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ (45) భర్త 15 సంవ‌త్స‌రాల క్రితం మృతి చెందాడు. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తె శైల‌జకు వివాహ‌మైంది. వెంకటమ్మ పాత ఇనుప సామగ్రి అమ్మ‌కాలు, కొనుగోళ్లు చేస్తూ జీవనం గడుపుతోంది.

గతంలో ఓ విద్యుత్ ప్రమాదంలో కుమారుడు ఈశ్వర్ చేతికి గాయాలు కాగా.. వైద్యులు అత‌ని చేతిని తొల‌గించారు. అత‌నికి ఒక చేయి లేక‌పోవ‌డంతో పెళ్లి కావ‌డం లేదు. దీంతో త‌ర‌చూ త‌ల్లితో కుమారుడు గొడవ ప‌డుతుండేవాడు. ఈ క్ర‌మంలో మద్యానికి బానిసగా మారిన ఈశ్వర్ త‌ల్లిపై ఆగ్ర‌హం పెంచుకున్నాడు. తన దూరపు బంధువైన పర్వతం రాము సాయంతో తల్లిని హత్య చేశాడు. పదునైన ఆయుధంతో ముందుగా వారు ఆమె గొంతును నరికారు. ఈ నేరం త‌మ‌పై ప‌డ‌కూడ‌ద‌ని ఆమె రెండు కాళ్లూ న‌రికేసి.. కాళ్ల క‌డియాల‌ను దాచిపెట్టారు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వ‌చ్చి త‌ల్లిని చంపారని, క‌డియాలు ఎత్తుకెళ్లార‌ని ఈశ్వ‌ర్ త‌న సోద‌రి శైల‌జ‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె ఫిర్యాదుతో కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు ఈశ్వ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా క‌నిపించ‌డంతో అదుపులోకి తీసుకొని త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేయ‌గా, నేరాన్ని అంగీక‌రించాడు.

First Published:  25 Aug 2023 5:08 AM GMT
Next Story