Telugu Global
Telangana

రైతుబంధుపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం..!

రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్‌ను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎకరానికి ఏటా రూ. 10వేలు జమ చేస్తూ వచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్‌పై ప్రకటన చేసింది.

రైతుబంధుపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం..!
X

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొత్త స్కీమ్‌లను పట్టాలెక్కించే పనిలో పడింది. అలాగే గత ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్‌లపైనా నజర్ పెట్టింది. కేసీఆర్ హయంలో అమలైన రైతుబంధును రైతుభరోసాగా అమలు చేయబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. స్కీమ్‌ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందన్నారు జీవన్‌రెడ్డి. దీనిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ఈనెల‌ చివరిక‌ల్లా రైతుల ఖాతాల్లో డబ్బులు జ‌మ చేస్తుందన్నారు. ధరణిలో లొసుగులను ఆసరాగా చేసుకుని కొంతమంది భూస్వాములు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వందల ఎకరాలను సాగు భూములుగా చూపిస్తూ లక్షల రూపాయల రైతుబంధు సాయం పొందుతున్నారని అన్నారు. అందుకే సాగు చేసే భూములకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఎకరాకు ఏటా రూ.15వేల చొప్పున సాయం అందించేలా చూస్తామన్నారు.

రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్‌ను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఎకరానికి ఏటా రూ. 10వేలు జమ చేస్తూ వచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్‌పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామంది. కేసీఆర్ హయాంలో అమలైన రైతుబంధు స్కీమ్‌ అమలు తీరుపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్.. అధికారంలోకి రావడంతో సాగుచేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకోబోతోంది.

First Published:  11 Dec 2023 6:51 AM GMT
Next Story