Telugu Global
Telangana

ఈ గుండెను కాపాడుకోండి.. కౌశిక్‌రెడ్డి నుంచి మరో భావోద్వేగ వీడియో

'అనేక ఇబ్బందులకు గురైనప్పటికీ ఏనాడు ప్రజలను విడిచిపెట్టి పోలేదు. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను'

ఈ గుండెను కాపాడుకోండి.. కౌశిక్‌రెడ్డి నుంచి మరో భావోద్వేగ వీడియో
X

హుజూరాబాద్ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మరో భావోద్వేగ వీడియోతో ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే కేసు నమోదు కాగా.. మరోసారి ఆయన అదే త‌ర‌హాలో మాట్లాడుతూ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.

ప్ర‌చారం చివ‌రి రోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ 'ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి'.. అంటూ ఓటర్లను అభ్యర్థించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. కౌశిక్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఇదిలా ఉంటే.. మ‌రోసారి ఎమోషనల్ కామెంట్స్‌తో కౌశిక్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో '2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోయాను. అనేక ఇబ్బందులకు గురైనప్పటికీ ఏనాడు ప్రజలను విడిచిపెట్టి పోలేదు. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ గుండె అలసిపోయింది. ఈ గుండె బరువెక్కింది. ఈ గుండెను మీరే కాపాడుకోవాలి' అని కౌశిక్ రెడ్డి ఆ వీడియోలో మాట్లాడారు.

కౌశిక్ రెడ్డి భార్య, కుమార్తె కూడా వీడియోలో ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. 'నా కొంగు జాచి అడుగుతున్నా.. నా భర్త కౌశిక్ రెడ్డిని గెలిపించండి' అని కౌశిక్ రెడ్డి భార్య కోరగా..' మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా.. ప్లీజ్.. మా డాడీని గెలిపించి కాపాడుకోండి' అని కౌశిక్ రెడ్డి కుమార్తె ప్రజలను కోరింది. ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఈసీ సీరియస్ కాగా.. ఇప్పుడు మరోసారి కౌశిక్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడుతూ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.

First Published:  29 Nov 2023 12:27 PM GMT
Next Story