Telugu Global
Telangana

పారిశుథ్య కార్మికులు భగవంతునితో సమానం : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడులక సందర్భంగా సఫాయన్నా నీకు సలామన్నా.. అనే నినాదంతో పారిశుథ్య కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.

పారిశుథ్య కార్మికులు భగవంతునితో సమానం : సీఎం కేసీఆర్
X

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. తోటి మనుషుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుథ్య కార్మికులు భగవంతునితో సమానమని సీఎం కేసీఆర్ అన్నారు. వారు చేస్తున్న పనికి మనం ఏ మాత్రం వెలకట్టలేమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పారిశుథ్య కార్మకులు చేస్తున్న సేవలను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో దశాబ్ది వేడుకలపై నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడులక సందర్భంగా సఫాయన్నా నీకు సలామన్నా.. అనే నినాదంతో పారిశుథ్య కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. వారికి ప్రభుత్వం తగిన సాయం చేస్తుందని చెప్పారు. వారికి సాయం చేయడం అంటే పరోక్షంగా సమాజానికి సాయం చేయడం వంటిదే అని అన్నారు. సఫాయి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. సఫాయి కార్మికులు ఎలాంటి డిమాండ్ చేయకున్నా.. జీతాలు పెంచడానికి కారణం వారి మీద ఉన్న అపారమైన గౌరవమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

పారిశుథ్య కార్మికులు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టమని అన్నారు. మనకు క్షవరం చేసే వాళ్లు లేకపోతే అప్పుడు మనుషులు ఎలా ఉంటారో ఊహించుకోండి. నెత్తి పెరిగి, గడ్డం పెరిగి గుడ్డెలుగు లెక్క తిరుగుతుంటారు అంటూ సమీక్షలో కేసీఆర్ నవ్వులు పూయించారు. అలాగే రోడ్లు, పరిసరాలు శుభ్రం చేయకుండా ఉంటే ఎంత అధ్వాన్నంగా పరిస్థితులు తయారవుతాయో ఊహించుకోవడమే కష్టమని అన్నారు. ఈ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో సఫాయి అన్నలు, అక్కల పాత్ర చాలా గొప్పదని సీఎం చెప్పారు. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఉత్తమ సఫాయి కార్మకులను గుర్తించి మహిళ, పురుషులకు అవార్డులు అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

సీఎం కేసీఆర్ గ్రూప్ ఫొటో..

తెలంగాణ రాష్ట్ర పరిపాలనా భవనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సారి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహించాలనే విషయాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. సచివాలయం ఎదుట ఉన్నత స్థాయి అధికారులతో సీఎం కేసీఆర్ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


First Published:  26 May 2023 12:25 AM GMT
Next Story