Telugu Global
Telangana

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ముగ్గురు దుర్మరణం .. 16 మందికి గాయాలు

ఈ రోడ్డు ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. బస్సు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు    - ముగ్గురు దుర్మరణం .. 16 మందికి గాయాలు
X

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి వద్ద 44 జాతీయ రహదారిపై టీఎస్ ఆర్టీసీ బస్సు చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు మృతి చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న మియాపూర్ డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ గరుడ బస్సు ముమ్మళ్లపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న చెరుకు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని వనపర్తి ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆంజనేయులు (43), క్లీనర్ సందీప్ (35) అక్కడికక్కడే మృతి చెందగా, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వడ్డే శివన్న (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

ఈ రోడ్డు ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. బస్సు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పొగ మంచు వల్ల ముందు వెళ్తున్న ట్రాక్టర్ కనిపించక పోవడం కూడా ప్రమాదానికి ఒక కారణం అని వారు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

First Published:  21 Nov 2022 8:02 AM GMT
Next Story