Telugu Global
Telangana

కర్నాటకలో బీజేపీ భజరంగ్ "బలి".. రేవంత్ సెటైర్లు

భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాల్లో మార్పు మొదలైందని అన్నారు రేవంత్ రెడ్డి. జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ పడిన కష్టానికి కర్నాటక ఎన్నికల్లో ఫలితం కనపడిందన్నారు.

కర్నాటకలో బీజేపీ భజరంగ్ బలి.. రేవంత్ సెటైర్లు
X

కర్నాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వైపు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముడిని అడ్డుపెట్టుకుని పార్టీని విస్తరించాలనుకునే దుర్మార్గపు ఆలోచనను ఇకనైనే బీజేపీ మానుకోవాలని హితవు పలికారు రేవంత్ రెడ్డి. భజరంగ్ బలిని కూడా అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేయాలని చూశారని మండిపడ్డారు. శ్రీరాముడిని రాజకీయాలకు వాడుకోవాలని చూసి, ఆయనను అవమానించిన వారిని భజరంగ్ బలి ఆశీర్వదించడని తెలిపారు.


తెలంగాణలోనూ రిపీటవుద్ది..

కర్నాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ రిపీటవుతాయని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కూడా స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న వేళ.. హైదరాబాద్ లోని గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు.

భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాల్లో మార్పు మొదలైందని అన్నారు రేవంత్ రెడ్డి. జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ పడిన కష్టానికి కర్నాటక ఎన్నికల్లో ఫలితం కనపడిందన్నారు. జోడో యాత్ర వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చిందని, మోదీని గద్దె దింపేది ఎప్పటికైనా కాంగ్రెస్సేనని చెప్పారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇదే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరగబోతున్న ఎన్నికల్లోనూ తమదే విజయం అన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  13 May 2023 9:50 AM GMT
Next Story