Telugu Global
Telangana

నాది మెరిట్ కోటా -రేవంత్ రెడ్డి

మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ తోపాటు, కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. రెండు చోట్లా తనదే గెలుపు అంటున్న రేవంత్.. గెలిస్తే తనకు మూడు పదవులుంటాయని.. ఆ మూడింటిలో అధిష్టానం దేన్ని ఎంపిక చేసుకోమంటే అందులోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

నాది మెరిట్ కోటా -రేవంత్ రెడ్డి
X

తనది మేనేజ్ మెంట్ కోటా కాదని, మెరిట్ కోటా అని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇంటి వద్ద అభిమానులు సీఎం - సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా, మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ తోపాటు, కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. రెండు చోట్లా తనదే గెలుపు అంటున్న రేవంత్.. గెలిస్తే తనకు మూడు పదవులుంటాయని.. ఆ మూడింటిలో అధిష్టానం దేన్ని ఎంపిక చేసుకోమంటే అందులోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

రేవంత్ ఇంటి వద్ద సందడి..

ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టొచ్చని చెప్పారు. ఓటింగ్, కౌంటింగ్ మధ్యలో.. ఆయన ఇంటికి కీలక నేతలంతా పోటెత్తారు. అభ్యర్థులు, సీనియర్ నేతలు.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. వీరిలో చాలామంది ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఇంటి ముందు సీఎం-సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు.

రేవంత్ అభిమానులంతా ఆయన ఇంటి వద్ద నినాదాలు చేస్తుంటే.. కాంగ్రెస్ లోని రేవంత్ వైరివర్గం ఇబ్బంది పడుతోంది. సీనియర్లు పరోక్షంగా తమ అసంతృప్తిని సన్నిహితుల వద్ద బయటపెడుతున్నారు. అటు షర్మిల కూడా రేవంత్ కి సీఎం సీటు ఇవ్వొద్దంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో సమర్థులు చాలామంది ఉన్నారంటూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లను ఆమె ప్రస్తావించారు. రిజల్ట్ ఎలా వస్తుందో, ఆపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  2 Dec 2023 2:16 PM GMT
Next Story