Telugu Global
Telangana

రేవంత్‌కే దిక్కుతోచటం లేదా?

ఇప్పుడు సమస్య ఏమిటంటే కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్న నేతలతో సుదీర్ఘంగా భేటీలు జరుపుతున్నారట. మొత్తానికి పార్టీలోపలా బయట జరుగుతున్న వ్యవహారాలతో రేవంత్‌కు దిక్కుతోచటం లేదని సమాచారం.

రేవంత్‌కే దిక్కుతోచటం లేదా?
X

కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొడవలు పడుతూ పార్టీని గబ్బుపట్టించటమే లక్ష్యంతో పనిచేస్తుంటారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు అర్ధం కావటంలేదని సమాచారం. మామూలుగా రేవంత్ చాలా చురుకైనవాడు, బాగా తెలివైనవాడే. అయితే అంతటి తెలివైన నేతకే పార్టీ వ్యవహారాలు అర్ధంకాక, పార్టీపై పట్టు చిక్కటం లేదంటే వ్యవహారం ఎంతలా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

పార్టీలో కోవర్టులున్నారనే ఆరోపణలే ప్రధానంగా రేవంత్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. బాధ్యతలు తీసుకున్న కొత్తల్లోనే పార్టీలోని కోవర్టులు అందరు స్వచ్చంధంగా పార్టీ నుండి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎవరూ వెళ్ళినట్లు లేదు. పైగా తాజా పరిణామాలపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ కోవర్టులకు కూడా పార్టీలో పెద్ద పదవులిచ్చారంటూ పెద్ద బాంబే పేల్చారు. దాంతో పార్టీలో కోవర్టులు ఎవరు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక వర్గం, దామోదర నాయకత్వంలో మరోవర్గం రేవంత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయట. ఈ రెండు వర్గాలు పార్టీలో బలమైనవనే చెప్పాలి. ఇక వీళ్ళు కాకుండా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత వీహెచ్ వర్గాలు ఉండనే ఉన్నాయి. అంటే రేవంత్‌కు వ్యతిరేకంగా చాలా వర్గాలు బాహాటంగానే పనిచేస్తున్నాయి. వీళ్ళందరి మీద పట్టు సాధించాలంటే రేవంత్ వల్ల కావటంలేదు. నిజానికి ఈ వర్గాలపై ఏ ఒక్కరూ పట్టు సాధించలేరు.

ఎందుకంటే పార్టీ అధిష్టానం ఒకళ్ళపై మరొకళ్ళని చెక్ పెట్టడం కోసం అందరినీ ప్రోత్సహిస్తుంటుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్న నేతలతో సుదీర్ఘంగా భేటీలు జరుపుతున్నారట. మొత్తానికి పార్టీలోపలా బయట జరుగుతున్న వ్యవహారాలతో రేవంత్‌కు దిక్కుతోచటం లేదని సమాచారం.

First Published:  17 Dec 2022 6:11 AM GMT
Next Story