Telugu Global
Telangana

త్వరలోనే రేవంత్ సర్కారు కూలిపోతుంది

ఏపీకి కాంగ్రెస్‌కంటే పెద్ద విలన్ ఏదీ లేదన్నారు విజయసాయిరెడ్డి. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని మండిపడ్డారు.

త్వరలోనే రేవంత్ సర్కారు కూలిపోతుంది
X

రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ హాట్ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు పదేళ్లు నమ్మలేదన్నారు విజయసాయిరెడ్డి. మోసపూరిత హామీలతో మళ్లీ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దేనికైనా టైమ్‌ రావాలి. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడానికి పెద్ద సమయమేం పట్టదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి కాంగ్రెస్‌కంటే పెద్ద విలన్ ఏదీ లేదన్నారు విజయసాయిరెడ్డి. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని మండిపడ్డారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాల్సిందే అన్నారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఏపీపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. చట్టంలో చేర్చడం కాంగ్రెస్‌కు చేతగాక, ఇప్పుడు తమను ఎందుకు నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

అసలు కాంగ్రెస్ పార్టీకి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశమే లేదన్నారు. కేవలం ప్రత్యేకహోదాను ఒక ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం అన్నారు విజయసాయిరెడ్డి. కుటుంబ వ్యవహారంలో తల దూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్‌కు ఉదాహరణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరన్న విజయసాయిరెడ్డి రాష్ట్రంలో హస్తం పార్టీ ఎప్పుడో అదృశ్యమైందన్నారు.

First Published:  5 Feb 2024 1:19 PM GMT
Next Story